ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో ఇప్పటి వరకూ రూ. 1300 కోట్ల పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరకు కాఫీని లక్ష ఎకరాల్లో సాగు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే పార్లమెంట్ భవనంలోను, రాష్ట్ర అసెంబ్లీ భవనంలోను అరకు కాఫీ ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలను పూర్తిగా నివారించేందుకు రూ. 1000 కోట్లతో మారుమూల ప్రాంతాలన్నిటికీ మెరుగైన రహదార్లను అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా రూ. 1600 కోట్లతో గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, రూ. 156 కోట్ల పలు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు.
గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దోహదపడే తాగు, సాగునీరు, రహదార్లు, విద్య,ౖ వెద్య సౌకర్యాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం సకాలంలో యుసిలను కేంద్రానికి పంపక పోడవంతో కేంద్రం నుండి నిధులు మంజూరు కాక ఆయా పనులన్నీ పెండింగ్లో ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక కేంద్రంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులను తెచ్చుకో గలుగుతున్నామని అన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు, పాడేరులకు రూ. 550 కోట్ల కేంద్ర నిధులను మంజూరు చేయించారని, ఆ నిధులతో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు కృషి జరుగుతోందన్నారు.
వివిధ రకాల గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించే లక్ష్యంలో భాగంగా 6 ఐటిడిఏల పరిధిలో రూ. 6 కోట్లతో సంచార గిరి బజారులను ఏర్పాటు చేయడం జరుగుతోందని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. అదే విధంగా గిరిజన మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజల వైద్య సేవలకై ప్రతి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కంటెయినర్ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. 65 రకాల మందులతో కూడిన ఈ కంటెయినర్ ఆసుపత్రుల ద్వారా ఆసుపత్రులు అందుబాటులో లేని గిరిజన ప్రాంతాల్లో వీటి ద్వారా వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మహిళా శిశు సంమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. గత 10 నెలల్లో 1100 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేశామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో 1100 అంగన్వాడీ కేంద్రాల్లో రూ. 53 కోట్లలతో పౌష్టికాహారం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నాణ్యమైన కోడిగ్రుడ్లు, చిక్కీలు,పాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో మినీ అంగన్ వాడీలను మెయిన్ అంగ్వాడీలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకరమైన,పరిశుభ్రమైన వాతావరణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 9,246 మరుగుదొడ్లు, 11,403 తాగునీటి సౌకర్యాల నిర్మాణాల కోసం రూ. 52.68 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 422 అంగన్వాడి కార్యకర్తలు, 1130 అంగన్వాడి ఆయాల పోస్టులు భర్తి చేయడం జరిగిందని చెప్పారు. అంతేగాక గిరిజన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు గిరిజన గర్భిణీ వసతి గృహాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. 10.5 కోట్ల వ్యయంతో 35 బర్త్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే తల్లి బిడ్డ ఆసుపత్రులను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలకు పూర్తిగా అండగా నిలిచేందుకు జిల్లాకు ఒకటి వంతున 26 వన్ స్టాప్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని మంత్రి సంధ్యారాణి వివరించారు.