
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లా ఎన్టీఆర్ విగ్రహం
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ çస్మృతివనం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ ఈ ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి, పొట్టిశ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు.