
తల్లిదండ్రుల్ని చంపేసిన కొడుకు రాజశేఖర్ (కుడి పక్కన)
ఆస్తి కోసం తల్లిదండ్రుల్ని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన కొడుకు
తోడబుట్టిన చెల్లికి ఆస్తిని పంచి ఇచ్చారనే సాకుతో కన్నతల్లిదండ్రులనే ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు ఇక్కడో ప్రబుద్ధుడు.
తోడబుట్టిన చెల్లికి ఆస్తిని పంచి ఇచ్చారనే సాకుతో కన్నతల్లిదండ్రులనే ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు ఇక్కడో ప్రబుద్ధుడు. చంపొద్దంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నా కనికరించ లేదు. భూమి పంపకంపై కక్ష పెంచుకుని ట్రాక్టర్తో వేటాడి, తొక్కించి నిండు ప్రాణాలను బలిగొన్నాడు ఈ కనికరం లేని కొడుకు.
ఈ దుర్ఘటన విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామంలో జరిగింది. పాండ్రంకి అప్పలనాయుడు, జయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రాజశేఖర్ , కుమార్తె రాధాకుమారి. అప్పలనాయుడు 80 సెంట్లు భూమి ఉన్న ఒక చిన్నకారు రైతు. తనకున్న 80 సెంట్లులో కూరగాయలు, ఆకుకూరలు పండించి జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె రాధకు ఏడేళ్ల క్రితం విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. రాధకు ఇద్దరు పిల్లలు. పెళ్లి సమయంలో తమకున్న భూమిలో 20 సెంట్లు ఆమెకు తల్లిదండ్రులు రాసిచ్చారు. ఐదేళ్ల కిందట రాధాకుమారి భర్త చనిపోగా కుమారుడితో కలిసి ఆమె పుట్టింటి వద్దనే ఉంటున్నారు.
మిగిలిన ఆస్తి పంపకాలలో తల్లిదండ్రులు, కుమారుడి మధ్య రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి నెల్లిమర్ల మండలం వల్లాపురంకు చెందిన ఓ యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది.
వివాహ అనంతరం రాజశేఖర్ చెడు అలవాట్లకు బానిస అయ్యి అప్పుల పాలయ్యాడు. ఓ వైపు భర్త మరణంతో తమపై ఆధారపడి ఉన్న కుమార్తె జీవితం, మరోవైపు చెడు అలవాట్లతో అప్పులు పాలైన కుమారుడిని చూసి అప్పలనాయుడు దంపతులు తల్లడిల్లిపోతుండేవారు. అయితే అప్పలనాయుడు తన 80 సెంట్లు భూమిలో 20 సెంట్లు భూమిని రాధ వివాహ సమయంలో కట్నంగా ఇవ్వగా, చెడు అలవాట్లకు బానిసైనా కొడుకు మిగతా భూమిని ఎప్పుడైనా విక్రయించే అవకాశముందని గ్రహించిన అప్పలనాయుడు దంపతులు మరో 30 సెంట్లు భూమిని కూడా కుమార్తె రాధకు రిజిస్ట్రేషన్ చేశారు.
అలా తన 80 సెంట్ల భూమిలో కుమార్తె రాధకు 50 సెంట్లు ఇచ్చారు. ఇది తెలుసుకున్న కొడుకు రాజశేఖర్ తరచూ రాధకు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తనకి ఇవ్వాలని గొడవ పడుతుండేవాడు. అయినా అప్పలనాయుడు మాత్రం ససేమిరా అన్నాడు. ఈ నేపథ్యంలోనే అప్పుల బాధలు భరించలేక తండ్రి అప్పలనాయుడు వద్ద ఉన్న భూమిని అమ్మటానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా భూమిని చదును చేసేందుకు జెసిబి, ట్రాక్టర్ సహాయంతో పొలంలో పనులు చేస్తున్నాడు. భూమిని విక్రయించేందుకు పొలంలో పనులు చేస్తున్నాడని తెలుసుకున్న అప్పలనాయుడు దంపతులు ఇద్దరు పొలం వద్దకు చేరుకొని కుమార్తె రాధకు ఇచ్చిన భూమిని కూడా చదును చేయడాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులు అడ్డుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ట్రాక్టర్ను వారిపై ఎక్కించేందుకు రాజశేఖర్ ప్రయత్నించాడు. భయంతో వారు మొక్కజొన్న తోటలోకి పరుగు తీశారు. అయినా విడవకుండా తోటలోకి ట్రాక్టర్తో వెళ్లి వారిని తొక్కించేశాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు.
అనంతరం రాజశేఖర్ భార్యతో కలిసి జిల్లాకేంద్రంలోని పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Next Story