
పిడుగులు పడే ప్రదేశంలో సైరన్ హెచ్చరికలు
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ మీద సమీక్ష నిర్వహించారు.
పిడుగులు పడే ప్రాంతాల్లో విలువైన ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని.. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్ధంగా పనిచేసేలా చూడాలని, ముందుగానే ఆయా ప్రాంతాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్రేటు కలిగిన స్టేట్గా ఏపీని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ను ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలతో క్రైమ్హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతో పాటు ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజి వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేటు కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలని, కొందరు తెలివిగా నేరాలు చేసి.. దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని.. పోలీసులకు సహకరించని వ్యక్తులు, నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద వారి వద్ద నుంచి డేటాను తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా నేరాలకు బాధ్యులుగా చేసే అంశంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజా భద్రత కోసం.. నేరాల కట్టడి కోసం.. దర్యాప్తు నిమిత్తం.. షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించే విషయాల్లో పబ్లిక్ సేఫ్టీ యాక్టును వర్తింప చేయాలన్నారు. మరోవైపు వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని చంద్రబాబు ఆదేశించారు.