సింగయ్య  మృతి కేసులో ఏ2 గా జగన్
x

సింగయ్య మృతి కేసులో ఏ2 గా జగన్

సింగయ్య భార్య చీలి లూర్థు మేరీ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి నల్లపాడు పోలీసుల అదుపులో ఉన్నారు. జగన్ కారు కింద పడి చీలి సింగయ్య (53) మృతి చెందిన కేసులో అరెస్టయ్యాడు. కారు నెంబర్ AP 40 DS 2349గా గుర్తించిన పోలీసలు A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా మాజీ సీఎం వైఎస్ జగన్, A3గా జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి, A4గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, A5, A6 లుగా మాజీ మంత్రులు పేర్ని నాని (వెంకట్రామయ్య), విడదల రజిని ని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

ప్రమాదం జరిగినరోజు 106 (1) బిఎన్ఎస్ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. తాజాగా ప్రమాద స్థలంలో లభించిన ఆధారాలు పరిశీలించి ఈ నేరానికి సంబంధించి 105, 49 బిఎన్ఎస్ సెక్షన్ల కిందరకు మార్చారు. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.

ఆరోజు ఏమి జరిగింది?

జూన్ 18, 2025న మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. రోడ్‌షోలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చీలి సింగయ్య (53) జగన్ కారు (నెంబర్ AP 40 DS 2349) కింద పడి మరణించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఏటుకూరు వద్ద లాల్పురం హైవేపై జరిగింది.

సింగయ్య జగన్‌మోహన్ రెడ్డి కారుపై పూలు చల్లేందుకు ప్రయత్నిస్తుండగా, ఒకరిని ఒకరు నెట్టుకోవడంతో తూలి కారు కింద ప కిందపడినట్లు వీడియో ఫుటేజ్ ద్వారా తెలిసింది. వీడియో ప్రకారం కారు ముందు చక్రం సింగయ్య మెడపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఆగలేదని, ఆ తర్వాత కొద్దిసేపు ఆగి మళ్లీ కదిలిందని సాక్షులు పోలీసులకు తెలిపారు. స్థానిక ఏఎస్ఐ రాజశేఖర్ సింగయ్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు మృతుడిని తీసుకొచ్చారని ప్రకటించారు.

పోలీసు చర్యలు

గుంటూరు నల్లపాడు పోలీసుల వాదన ప్రకారం ప్రమాద సమయంలో జగన్ కాన్వాయ్‌లో అనుమతించిన దాని కంటే ఎక్కువ వాహనాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. రోడ్‌షోకు పోలీసు అనుమతి లేకపోవడం కూడా వివాదాస్పదంగా మారింది. అందుకు బాధ్యులుగా భావిస్తూ వీరిపై కేసు నమోదు చేశారు.

వైఎస్సార్‌సీపీ స్పందన

వైఎస్సార్‌సీపీ ఈ ఘటనను రాజకీయ కుట్రగా అభివర్ణించింది. ఈ ప్రమాదాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జగన్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఉపయోగిస్తోందని ఆరోపించింది. ప్రమాద సమయంలో జగన్‌కు Z+ భద్రత ఉన్నప్పటికీ, తగిన రోప్ పార్టీ లేదా రోడ్ క్లియరెన్స్ టీమ్ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని, ఇది ప్రభుత్వ వైఫల్యమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

వైఎస్సార్‌సీపీ నేతలు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరపున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు.

Read More
Next Story