సింహాచలం దుర్ఘటన– 25లక్షల నష్ట పరిహారం
x

సింహాచలం దుర్ఘటన– 25లక్షల నష్ట పరిహారం

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.


సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి కింద మృతుల కుంటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, దుర్ఘటనలో గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున అందజేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలిరాగా, అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి క్యూలైన్‌లో గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అత్యవసర వైద్యసేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్‌ గజపతి రాజుతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అలాగే, గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.
మరోవైపు, గోడ కూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలిగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు భయాందోళనలు చెందకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం- పవన్‌ కల్యాణ్‌
సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్‌ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నాను. భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
ఈ దుర్ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మరణించడం తీవ్ర ఆవేదన కలిగించిందని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More
Next Story