
Srisailam Project
సీమ నీటి సమస్యకు, శ్రీశైలం భద్రతకు పరిష్కారం సిద్ధేశ్వరం అలుగే
సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ప్రభుత్వ శంకుస్థాపనగా మారాలి.
-మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి
సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం 2016 మే 31 న రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం 25 వేల మంది రైతులు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రజా శంకుస్థాపన చేసిన రోజు. ఒక్క రాజకీయ పార్టీ అండలేకుండా , ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రజాస్వామిక చారిత్రక పోరాటం అది.
సిద్ధేశ్వరం నేపథ్యం
సిద్ధేశ్వరం రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం. దాదాపు 9 దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. పలితం రతణాలసీమగా ఉండాల్సిన రాయలసీమ నేడు కరువుసీమగా మారి ప్రపంచం ముందు సాయం కోసం దీనంగా నిలబడిన దైన్యస్దితి. 1911-12 ప్రాంతములోనే ఆంగ్లేయుల కాలంలో మెకన్జి సిపార్సుల మేరకు సిద్ధేశ్వరం సర్వేచేసి నిర్మాణానికి అంగీకారం తెలిపారు. తదనంతరం 1958 ప్రాంతములో భారత ప్లానింగ్ కమీషన్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
రాయలసీమకు 18 లక్షల ఎకరాలకు, నాటి తమిళనాడుకు 5 లక్షల ఎకరాలకు మొత్తం 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దాదాపు 250 TMC ల సామర్ద్యంతో ప్రాజెక్ట్ ను రూపొందించారు. అదే జరిగి ఉంటే నేడు రాయలసీమకు 250 TMCల నికరజలాలు హక్కుగా మారి ఉండేది. అంతేకాదు సీమ మొత్తం వ్యవసాయం వృద్దిచెంది దానికి అనుబందంగా పరిశ్రమలు, అపార ఖనిజ సంపద, వాతావరణ అనుకూల పరిస్దితుల నేపద్యంలో గణనీయమైన అబివృద్ది సాదించి భారతదేశంలోనే అత్యంత అబివృద్ది చెందిన ప్రాంతముగా నేడు మన రాయలసీమ ఉండేది. అందుకే సిద్ధేశ్వరం నిర్మాణం రాయలసీమ నీటి అవసరాలకు అత్యంత ముఖ్యం.
నికర జలాలు ఉన్నా అనుభవించలేని దుస్దితి....
రాయలసీమకు నికరజలాల కేటాయింపులో అన్యాయం జరిగింది. అదే సందర్బంలో ఉన్న 133.7 TMCలలో కనీసం సగం నీటిని వాడుకోలేక పోతున్నాము. ప్రాజెక్ట్ లవారిగా పరిసీలిస్తే
1. HLC ఈ తుంగబద్రా హైలెవల్ కెనాల్ కి ఉన్న 32.5 TMC లో 17,18 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
2.LLC 29.5 TMCలలో 11 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
3.KC కెనాల్ కు 39.9 TMC లు ఉండగా ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పి 50,60 TMC లు డ్రా అవుతున్నట్లు చూపిస్తున్నారు. కాని వాస్దవం లో 15 TMC లు మాత్రమే వాడుకుంటున్నాము.
4. బైరవాన్ తిప్పా 4.9 TMC లలో కేవలం 0.5 లు వాడుకుంటున్నాము. SRBC లో 19 TMC లు ఉన్నా అందులో ఉపయోగించు కుంటున్నది 7,8 TMC లు మాత్రమే.
స్థూలంగా చెప్పాలంటే సీమకు అధికారికంగా, హక్కుగా ఉన్న 133.7 TMC లలో మనం దాదాపు సగం అంటే 65 TMC లను వాడుకోవడంలేదు. దీని ఖరీదు వరి పంట అయితే కనీసం 5,6 లక్షల ఎకరాలు, అదే డ్రిప్ లాంటి వ్యవసాయం అయితే 13 లక్షల ఎకరాలు పంటనీటిని వాడుకోలేని పరిస్థితి. ఇవి కాక శ్రీశైలం లోని క్యారి ఓవర్ క్రింద 60 TMC లు, పట్టిసీమ నిర్మాణం ద్వారా 45 TMC లు, పులిచింతల ద్వారా ఒప్పందం మేరకు 54 TMC లను మనం వాడుకోవాలి. అంటే దాదాపు 159 TMC ఇంకా రాయలసీమ వాడుకోవడానికి అవకాశం ఉంది. అధికారికంగా ఉన్న 133.7 TMC లనే వాడుకునే ఏర్పాట్లు లేనపుడు ఇంకా అవకాశం ఉన్న 159 TMC లను ఎలా వాడుకోవాలి. రెండు కారణాల వలన సీమ ప్రాంతం నీటిని వాడుకోలేక పోతుంది. 1 నీటి నిల్వ చేసుకునే ఏర్పాట్లు తగినంతగా సీమలో లేవు. 2 అవకాశం ఉన్న శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తు వరకు ఉండాల్సిన నీటి నిల్వను 800 అడుగుల వరకు కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలు నిబంధనలకు వ్యతిరేకంగా నీటిని కిందకు వదిలివేస్తున్నాయి. శ్రీశైలం నీటి మట్టాని 854 అడుగులు ఉండేలా చూడటం. శ్రీశైలంకి 86 కీలోమీటర్ల పైన 860 అడుగల ఎత్తులో సిద్ధేశ్వరం అలుగును నిర్మించాలి.
సిద్ధేశ్వరం అలుగు ప్రయోజనం....
సిద్ధేశ్వరం అలుగును శ్రీశైలం కు పైన నిర్మిస్తారు కాబట్టి 50TMC ల నీటిని నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సిద్ధేశ్వరం అలుగు కాబట్టి క్రిష్ట నీరు సిద్ధేశ్వరం పొంగిన తర్వాతనే శ్రీశైలంకు వెలుతుంది. అంటే కచ్చితంగా 50 TMC లు నీరు నిల్వ ఉంటుంది. బ్యాక్ వాటర్ తో పనిచేసే పోతిరెడ్డి పాడు 842 అడుగులు కాబట్టి కనీసం 19 అడుగుల నీరు చేరి తెలుగు గంగా, గాలేరు-నగరి, SRBC లకు నీటి సమస్య పరిష్కారమవుతుంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పధకానికి నీటి సమస్య రాకుండా ఉండటంతో బాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ కు కూడా నీరు ఇవ్వవచ్చు.
సిద్ధేశ్వరంపై అనుమానాలు- వాస్తవాలు....
దేశంలోని ఏ ప్రాజెక్టు కూడా అడ్డంకులు లేకుండా నిర్మాణం పూర్తి కాలేదు. నేడు పోలవరం నిర్వాసితుల సమస్య , తెలంగాణ, చత్తీస్ ఘడ్ , ఒడిశా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. సమస్యలు ఎదుర్కొంటునే ముందుకు వెళుతున్నాము. సిద్ధేశ్వరం కూడా అలానే పరిష్కరించబడుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో అంతర్బాగంగా మరో ప్రాజెక్ట్ కు అనుమతి రాదు, పైన నీటిని నిల్వ ఉంచుకుంటే క్రిందికి నీరు రాదు కదా. అన్నది నేటి ప్రశ్నలు. మొదటది ఒక ప్రాజెక్ట్ లో అంతర్బాగంగా మరో ప్రాజెక్ట్ సాధ్యం కాదు అంటున్న పెద్దలు పోలవరంకి అంతర్భాగంగా పట్టిసీమను ఎలా నిర్మించారు. ఇక రెండవ అనుమానం క్రిందకు నీరు పోదు కదా నిజమే కచ్చితంగా సిద్ధేశ్వరం దగ్గర 50 TMC లు నీరు ఉన్న తర్వాతనే క్రిందకు వెలుతుంది. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి అధికారికంగా సీమకు 133.7 TMC లు ఉన్నాయి. సీమలో నీటి నిల్వకు తగిన ఏర్పాట్లు లేవు కనుక కనీసం 65 TMC లు ను వాడుకోలేక పోతున్నాము. సీమ వాడుకోలేని ఆ నీరు ఆవిరి కాదు లేదా వెనకకు పోదు సీమ వాడుకోలేని నీరు సరాసరి శ్రీశైలం ద్వారా క్రిందకు వెలుతుంది. అంటే 60-70 TMC ల నీటిని పైన నిలుపుకునే నైతిక హక్కు సీమకు ఉంది. అదే సమయంలో 100 TMC లకు పైగా నికర జలాలు కలిగి 200 నుంచి 600 TMC ల నీటిని తీసుకువస్తున్న తుంగభద్ర నీటిని గుండ్రేవుల లాంటి ప్రాజెక్టుల నిర్మాణం చేయకపోవడం వల్ల పూర్తిగా వాడుకోలేని దుస్థితి. ఇన్ని అనుకూల అంశాలు ఉన్నందున సిద్దేశ్వరం అలుగు మన హక్కు.
శ్రీశైలం భద్రత నేపథ్యంలో అలుగు కీలక పరిష్కారం
శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభంలో 300 TMC ల పై చిలుకు సామర్ధ్యంతో నిర్మాణం జరిగిన పూడిక వల్ల దాని సామర్ధ్యం 170 TMC లకు పడిపోయింది. పూడిక ఇతర కారణాల వల్ల శ్రీశైలం భద్రతకు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చతీస్తున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం సిద్ధేశ్వరం అలుగు ప్రతిపాదిత ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని భావిస్తుంది. శ్రీశైలం భద్రత, రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభించే సిద్ధేశ్వరం అలుగు చేపట్టడం అవసరం. కేంద్రంతో మాట్లాడి ఒప్పించ గలిగితే నిధుల సమస్య ఉండదు.
సీమ పైన తెలంగాణతో సహ మిగిలిన రాష్ట్రాలు ప్రాజెక్ట్ లు కడుతున్నారు. అవి తరవాత కాలంతో నికరజలాల ప్రాజెక్ట్ లుగా మారి పోతే సీమకు నీటి మీద కనీస హక్కును కోల్పోతాము. అందుకే ఒక సారి సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ను కోల్పోయి దాదాపు 250 TMC ల నికర జలాలను కోల్పోయాము. మల్లీ ఇప్పుడు ఆ చిన్నపాటి ప్రాజెక్ట్ ను కూడా సాదించుకోక పోతే సీమ బవితవ్యం ప్రమాదంలో పడక మానదు. అందువలన రాయలసీమ నీటి అవసరాలకు సిద్ధేశ్వరం కచ్చితంగా కీలకం. దాన్ని సాదించు కోవడం రాయలసీమ ప్రజల కర్తవ్యం.
Next Story