వదిన భారతికి సపోర్టుగా ఆడపడుచు షర్మిల
x

వదిన భారతికి సపోర్టుగా ఆడపడుచు షర్మిల

రాజకీయ కక్షలతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగొద్దని షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్య వైఎస్‌ భారతిపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, జగన్‌ చెల్లి, భారతి ఆడపడుచు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విష సంస్కృతికి బీజం వేసింది తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలే అని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడిన వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. వదిన భారతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

షర్మిలా ఏమన్నారంటే..
భారతి రెడ్డి గారి మీద సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్‌ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్‌ కోసం ఎంటర్‌ టైన్‌ చేసే యూట్యూబ్‌ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్‌ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలి.
రాజకీయ కక్ష్యలతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగొద్దన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే. సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్‌ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి. అంటూ వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More
Next Story