భోలే బాబా లీలలు ఇన్నిన్ని కావయా?  టీటీడీ లడ్డూ కల్తీ కేసులో కొత్త కోణాలు
x

"భోలే బాబా" లీలలు ఇన్నిన్ని కావయా? టీటీడీ లడ్డూ కల్తీ కేసులో కొత్త కోణాలు

కల్తీ నెయ్యి వ్యవహారం కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికే పరిమితం కాలేదు.మిగిలిన అన్ని ప్రధాన ఆలయాలకు కూడా...


తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న కేసులో జరుగుతున్న సిట్ విచారణలో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగు చూశాయి.ఇప్పడు మరో అంశం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది.కల్తీ నెయ్యి (అసలది నెయ్యే కాదు)తిరుమల తిరుపతి ఆలయానికే పరిమితం కాలేదు.అన్ని ప్రధానమైన ఆలయాలకూ అదే కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. ఈ మొత్తం కల్తీ వ్యవహారంలో భోలేబాబా డెయిరీ అంతా తానై వ్యవహరించిందని సిట్ తేల్చింది. సిట్ విచారణలో బయటపడిన ఈ అంశంతో భక్తుల మనోభావాలు మరింతగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది.

ఏఏ ఆలయాలకు కల్తీ నెయ్యి వెళ్లింది..?
కల్తీ నెయ్యి వ్యవహారం కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికే పరిమితం కాలేదు.మిగిలిన ప్రధాన దేవాలయాలు విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు చేరడం విస్తుగొలుపుతోంది.టీటీడీ లడ్డూ కల్తీ పై విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు తీగ లాగితే డొంక కదిలినట్లు బోలేబాబా డెయిరీ లీలలు ఒక్కటొక్కటిగా తెలిసొచ్చాయి.ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.ఇప్పుడీ కల్తీ కుట్ర నిగ్గు తేల్చేందుకు.. ఏ13గా ఉన్న భోలేబాబా డెయిరీ మేనేజర్‌ చౌహాన్‌ కోసం వేట మొదలు పెట్టారు సిట్‌ అధికారులు.అంతా భోలేబాబా లీలలేనా , దీని వెనుక పెద్దలు ఎవరు వున్నారన్న అంశాన్ని సిట్ నిశితంగా పరిశీలిస్తోంది.
భోలేబాబా డెయిరీ జీఎం బెయిల్ పిటీషన్ తిరస్కరణ
భోలేబాబా డెయిరీ జనరల్‌ మేనేజర్‌ హరిమోహన్‌ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది.హరిమోహన్‌ రాణా ఈ కేసులో ఏ12గా వున్నాడు.బెయిల్ పిటీషన్ పై వాదనల సందర్భంగా బెయిల్ ను వ్యతిరేకిస్తూ సిట్ తరపున ఏపీపీ వినిపించిన వాదనతో ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి.కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని టీటీడీతో పాటు ఏపీలోని మిగిలిన ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.అదే విషయాన్ని సిట్ తరపు న్యాయవాది కోర్టు ముందుకు తెచ్చారు. భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో హరిమోహన్‌ రాణా మాస్టర్‌మైండ్‌ అని, బయటకు వెళ్తే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నఏపీపీ వాదనతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించారు.
2022లోనే భోలేబాబాను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన టీటీడీ
ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీని 2022లో టీడీడీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.అయితే ఆ తరువాత మాల్‌గంగ అనే డెయిరీని భోలేబాబా తెరపైకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి కమీషన్‌ చెల్లించి సుగంధ ఆయిల్స్, పామోలిన్‌ సహ పలు రసాయనాలతో తయారుచేసిన కల్తీ నెయ్యిని పరోక్షంగా భోలేబాబా డెయిరీనే టీటీడీకు పంపింది.టీటీడీతో పాటు మిగిలిన ఆలయాలకూ అదే నెయ్యి సరఫరా చేసింది.అయితే భోలేబాబా డెయిరీ మేనేజర్ చౌహాన్ ను అరెస్ట్ చేస్తే పూర్తిగా అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్న సిట్ అధికారులు అతడి కోసం వేట మొదలుపెట్టారు.
మరోవైపు సుదీర్ఘ విచారణతో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో పాత్రధారులెవరన్నదీ సిట్‌ బృందం దాదాపుగా తేల్చేసింది.కాగా.. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు.ఈ నెల మొదటి వారంలో గత ప్రభుత్వ హయాంలోని పాలకవర్గంపై కూడా దృష్టి పెట్టిన సిట్ టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను అదుపులోకి తీసుకొని అనేక విషయాలు రాబట్టింది. శ్రీవారి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వులు, చేప నూనె వంటి మాంసాహార మూలాల కల్తీ జరిగిందన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై భక్తుల ఆగ్రహంతో పాటు దేశవ్యాప్తంగా విస్తృత ప్రతిస్పందన చోటుచేసుకుంది.దీంతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. గతేడాది నవంబరు 22న సిట్‌ దర్యాప్తు ప్రారంభమైంది.
Read More
Next Story