
సీఐడీ కస్టడీకి సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులు
మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు పీఎస్ఆర్ను విచారించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు అనుమతులిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆదివారం, సోమవారం, మంగళవారాల్లో పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ పోలీసు అధికారులు కస్టడీలోకి తీసుకోని విచారించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ పోలీసులు విచారణ చేపట్టనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదుల సమక్షంలోనే ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారించనున్నారు.
ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో డీజీ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన ఆంజనేయులును బుధవారం విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపైన విచారణ చేపట్టిన విజయవాడ కోర్టు ఆంజనేయులుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే జెత్వానీ కేసుకు సంబంధించి ఆంజనేయులును విచారించాల్సిన అవసరం ఉందని, ఆయన నుంచి మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉందని, దీని కోసం వారం రోజుల పాటు అంజనేయులును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపైన శుక్రవారం విచారణ చేపట్టిన విజయవాడ కోర్టు సీఐడీ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ పట్ల సానుకూలంగా స్పందించింది. అయితే సీఐడీ అధికారులు కోరినట్లు వారం రోజులు కాకుండా మూడు రోజులు పాటు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు సిఐడీ కస్టడీకి అంజనేయులును అప్పగిస్తూ అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణకు పీఎస్ఆర్ ఆంజనేయులు సహకరిస్తారా? లేదా? సీఐడీ అధికారులను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా దాటవేస్తారా? అన్నింటికి సమాధానాలు చెబుతారా? ఎవరెవరి పేర్లు వెల్లడిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Next Story