
సజ్జల శ్రీధర్ రెడ్డి దొరికాడు... ఇంతకీ ఎవరీ సజ్జల?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చక్రం తిప్పిన ‘సజ్జల’ లో ఈయన ఒకడు
వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన మద్యం కుంభకోణాన్ని పెంచిపోషించిన ‘గ్యాంగ్ ’ లోని మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని 'సిట్' (SIT) అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల కనిపించకుండా పోయిన శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు పట్టుకుని విజయవాడ తీసుకువచ్చారు. శనివారం నాడు అవినీతి నిరోధక శాఖ కోర్టు ముందు హాజరుపరుస్తారు.
మద్యం కుంభకోణం కేసులో ఆయన నెంబర్ 6 అంటే ఎ6. మద్యం కుంభకోణం అసలు సూత్రధారి అని సిట్ చెబుతున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత జరిగిన కీలకమయిన అరెస్టు ఇది. మద్యం కుంభకోణంలో శ్రీధర్ రెడ్డి వసూల్ రాజ అని అంటారు. మద్యంతయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించే బాధ్యత సజ్జల శ్రీధర్ రెడ్డిది నిర్వర్తించారని కసిరెడ్డి అరెస్టు తర్వాత సిట్ సేకరించిన ముఖ్యమయిన సమాచారం. మద్యం కుంభకోణంలో జరిగిన మూడో అరెస్టు ఇది. ఇంతకుముందు రాజ్ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను 'సిట్ అధికారులు అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా సిట్ ఆయన కదలికలపై దృష్టి సారించింది. శుక్రవారం ఆచూకి కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు.
ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి!
ఈ సజ్జల శ్రీధర్రెడ్డి జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన ముఖ్యమంత్రి పబ్లిక్ ఎఫైర్స్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువని చెబుతారు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఆయన మిత్రులు,బందువులు, సమీప బంధువులు, వాళ్ల సమీప బంధువులు, వాళ్ల మిత్రులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజ్యమేలారు. జగన్ ఎపుడో గాని బయటకొచ్చేవారు. ఆనవాల్లు లేకుండా వ్యవహారాలన్ని నడిపేందుకు రాజకీయాలతో సంబంధంలేని వాళ్లందరిని చుట్టూరు పెట్టుకున్నారు. వీళ్లే వాళ్లు. సజ్జల రామకృష్ణారెడి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి,వాసుదేవరెడ్డి లాంటి వాళ్లు ముఖ్యులు. వీళ్లకి అండ పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనంజయ్ రెడ్డి.
ఇక శ్రీధర్ రెడ్డి సొంత విషయానికి వస్తే, నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు. ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం ఆయన సొంతవూరు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో 1997లో ఇంజనీరింగ్ చదివే సమయంలో అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెబుతారు. వైసీపీలో చేరకముందు 2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఓటమి పాలయ్యారు. 2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మద్యం స్కామ్ లో విజయవంతమయ్యాడు. కానీ...
శ్రీధర్ రెడ్డి ఏంచేసేవాడంటే...
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే 'సిట్' క్లుప్తంగా వివరించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగిందని తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించి కమిషన్ ల కోసం బెదిరించారని సిట్ రిపోర్టు పేర్కొన్నారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని షరతు పెట్టారు. దీనికి అంగీకరించిన వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చారు. ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉంచారు. తర్వాత కమీషన్ మొత్తం 2024 నాటికి 20శాతం వరకూ పెంచడంలోనూ శ్రీధర్రెడ్డిదే మాస్టర్ మైండ్ అని 'సిట్' గుర్తించింది. ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వసూలు చేయడం ఆయన పని. దీనికోసం హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ రంగంలోకి దిగారు. అంతేకాదు, ఏపీలో ఉన్న డిస్టిల రీస్ ని కూడా బలవంతంగా లాక్కుని సదరన్ బ్లూ, నైన్ హార్స్ సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారని సిట్ పేర్కొంది.