
నేపాల్ టు వైజాగ్ తెలుగు పౌరుల సేఫ్ ల్యాండింగ్!
నేపాల్లో నెలకొన్న అల్లర్లతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు పౌరులను రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా విమానంలో విశాఖపట్నం తీసుకొచ్చింది.
అల్లర్లతో అట్టుడుకుతున్న నేపాల్లో చిక్కుకున్న వారిలో పలువురు భారతీయులతో పాటు తెలుగు రాష్ట్రాల వారూ ఉన్నారు. అక్కడి ఆందోళనకారులు తెలుగు వారు బస చేసిన హోటళ్లు, ఇతర భవనాలను తగులబెట్టారు. భారత్లోకి చేరుకునే మార్గాలనూ నిరసనకారులు దిగ్బంధనం చేశారు. దాడులకూ తెగబడుతున్నారు. దీంతో వారంతా ప్రాణభయంతో. నాలుగైదు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలా నేపాల్లో చిక్కుకుపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 144 మంది ఉన్నారు. వీరంతా ఖాట్మండు , హేటౌడా, పోఖరా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. తమను ఎలాగైనా స్వస్థలాలకు చేరవేయాలని అప్పట్నుంచి వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. నేపాల్ నుంచి వీరిని తీసుకురావడం కోసం మంత్రి లోకేష్ నేతృత్వంలోని ముగ్గురు మంత్రుల కమిటీని నియమించింది. ఐఏఎస్ అధికారులు నేపాల్లోని భారత రాయబార కార్యాలయంతోనూ, ఇతర అధికార యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరిపారు. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు హెల్స్లైన్ సెంటరును ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో నిరంతరం చర్చిస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. గురువారం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక విమానం ద్వారా వీరిని తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు వీరందరిని ఎక్కించుకుని ఆ ప్రత్యేక విమానం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

నేపాల్ నుంచి వచ్చే తెలుగు వారి కోసం ఎయిర్పోర్టులో వేచి చూస్తున్న ప్రజాప్రతినిధులు

ఎయిర్పోర్టులో నేపాల్ బాధితుల యోగక్షేమాలు తెలుసుకుంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్న తెలుగు వారు