చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు తిప్పలే!
x

'చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు తిప్పలే!'

నీరో చక్రవర్తి తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటున్న సాకే శైలజానాధ్


పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ప్రత్తి, అరటి, మొక్కజోన్న, మినుమలు, శెనగలు, మొక్కజొన్న, మిర్చితో పాటు ఏ పంటలకూ గిట్టుబాటు ధరలేక రైతులు రొడ్డెక్కే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. దీనికి తోడు పెట్టుబడి సాయం, ఇన్ పుట్ సబ్సిడీ లేకపోవడంతో సాగు భారమై అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, చంద్రబాబు మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే... ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.
ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే "పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేక రైతులు జీవితాలు నాశనమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు సర్కారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ద్రోహం చేయడం తప్ప... వారిని ఆదుకునే కార్యక్రమాలు లేవు. రైతుల కష్టాలను కనీసం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు... పంచసూత్రాల పేరుతో రైతన్నా మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.
రాయలసీమ జిల్లాలకు నీరివ్వడంపై కనీస శ్రద్ధ లేని సీఎం... నీటి భద్రత గురించి మాట్లాడ్డం విడ్డూరం. ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంటే ఏమిటో చంద్రబాబుకే తెలియాలి. ఇక రైతు పెట్టుబడి సాయం తగ్గించాలంటున్న చంద్రబాబుకి ఆ మాట చెప్పడానికి నోరెలా వస్తుందో అర్ధం కావడం లేదు. విత్తనాలు రేట్లు నియంత్రించాల్సింది, పెట్టుబడులు తగ్గించాల్సింది కూడా ప్రభుత్వమే. ఎరువులు ధరల విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కోసం క్యూలైన్లో నిల్చోవడంతో పాటు అధిక ధరలకు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుస్థితి. మీ మాటలు వెంటే రైతులు కడుపు మండుతుంది చంద్రబాబూ" అంటూ విరుచుకుపడ్డారు.
రైతు సాయానికి మనసురాని ప్రభుత్వమిది..
"ధరల స్థిరీకరణ నిధి గురించి చంద్రబాబు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. పెట్టుబడుల సదస్సు పేరుతో రూ.300 కోట్లు ఖర్చుపెట్టిన మీరు రైతుల కోసం మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు రాదు. రూ.600 కోట్లు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది.
ఇవాళ ఏ పంటకూ మద్ధతు ధర లేదు. ఉల్లి, టమోటతో పాటు చివరకి అరటి పంటను కూడా రైతులు పారబోసే రోజులు మీ పాలనలో దాపురించాయి. కిలో రెండు రూపాయలకు అరటి పళ్లు దొరికే దుస్థితి చంద్రబాబు పాలనలోనే కనిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వమిది. ప్రశ్నిస్తే తిరిగి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు" అని సాకే శైలజానాధ్ విమర్శించారు.
"18 నెలల కూటమి పాలనలో 15 దఫాలకు పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. అయినా ఈ ప్రభుత్వం రైతులను ఒక్కసారీ ఆదుకున్న పాపాన పోలేదు.
పదే పదే ఖజానాలో డబ్బుల్లేవని చెబుతున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పటి వరకూ చేసిన రూ.2.27 లక్షల కోట్లు అప్పుతో ఏం చేసింది? ఇదేనా మీ సంపద సృష్టి. మీరు చెప్పిన అప్పుల్లో కొంత మా రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టండి బాబూ? ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాపై ఎదురుదాడి చేస్తున్నారు. అసమర్ధునికి కోపమెక్కువ బాబూ. మీకు రైతుల పట్ల కనీస ప్రేమ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 మంది రైతులు ఇప్పటివరకూ ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు పెట్టుబడి సాయం లేక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక, ఎరువులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. చంద్రబాబు రోమ్ నగరం తగలబడిపోతుంటే... ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో మీ పాలన సాగుతోంది. రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో మీరు నీరో చక్రవర్తి తరహాలో మిగిలిపోవడం ఖాయమని" శైలజానాధ్ హెచ్చరించారు.
Read More
Next Story