యోగాసనాలకు రాకపోతే రూ.500 జరిమానా!
x
ప్రతీకాత్మక చిత్రాలు

యోగాసనాలకు రాకపోతే రూ.500 జరిమానా!

యోగా డే ఐదు లక్షల మంది జన సమీకరణకు అన్ని స్థాయిల్లోనూ అగచాట్లు. మీరు రాకపోతే ఇంట్లో వారినైనా పంపాలని డ్వాక్రా లీడర్లు వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు.

ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హాజరయ్యే ప్రోగ్రాములకు జనాన్ని తరలించడం ఎప్పడూ జరిగేదే. కానీ యోగా డే కార్యక్రమానికి కూడా ప్రజల్ని తోలుకెళ్లడానికి తంటాలు పడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాఖలో శనివారం జరిగే అంతర్జాతీయ యోగా డేకు ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంత పెద సంఖ్యలో జనాన్ని కూడకట్టే బాధ్యత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అప్పగించింది. దీంతో ఎవరి స్థాయిలో వారు యోగాసనాలకు తీసుకెళ్లే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. యోగా డేలో పాల్గొనే వారి పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ మేరకు సంబంధిత అధికారులు ఆ పనిని మొదలు పెట్టారు. ఇలా రిజిస్టరు చేయించుకున్న వారంతా వస్తారో? రారోనన్న బెంగ పట్టుకోవడంతో వారికి నయానో, భయానో నచ్చచెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా రానిపక్షంలో ఇబ్బందులెదురువుతాయని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఈ యోగా డే కార్యక్రమానికి మహిళలను తీసుకొచ్చే బాధ్యతను డ్వాక్రా గ్రూపు లీడర్లకు అప్పగించారు. తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి వీరు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల నుంచి వీరు అదే పనిలో ఉన్నారు.


ప్రతీకాత్మక చిత్రాలు

యోగా డేకి రాకపోతే రూ.500 ఫైన్‌..
‘మన యోగాంధ్ర ప్రోగ్రాం గిన్నిస్‌ బుక్‌లోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సభ్యురాలూ హాజరవ్వాలి. ఎవరు రాకపోయినా గ్రూపులో రూ.500 ఫైన్‌ వేస్తాం. కచ్చితంగా కట్టించుకుంటాం. మీరు రాకపోతే మీ భర్తను గాని, లేదా ఇంట్లో ఎవరో ఒకరిని పంపండి. 15 ఏళ్లు దాటితే మీ పిల్లలనైనా పంపండి. ఏ ఒక్కరూ మానొద్దు. ఆరోజు 10 గంటల వరకు కుళాయిలూ బంద్‌ అవుతాయి. మీరు యోగా డే నుంచి ఇళ్లకు వచ్చే వరకు కొళాయిలు రావు. మనం వచ్చినట్టు ఎమ్మెల్యే ఆఫీసుకు మెసేజ్‌ ఇచ్చాక కొళాయిలు విప్పుతారు. మన వార్డు నుంచి జనం రాలేదని క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా తెలిసిపోతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను ఎంతమంది వచ్చినా తప్పనిసరిగా తీసుకురండి. తెల్లవారుజామున మూడు గంటలకే నిద్ర లేచిరండి. నిద్ర లేదని, క్యారేజీలు కట్టాలని తప్పించుకోవద్దు. ఏ ఒక్కరు రాకపోయినా వారితో నెక్ట్స్‌ మంత్‌ సీవో మేడమ్‌తో మీటింగ్‌ పెడ్తాం. మన గ్రూపు నుంచి ఎంతమంది వస్తున్నారో చెప్పండి..’ అంటూ విశాఖ జిల్లాలోని ఓ డ్వాక్రా గ్రూపు లీడరు సెల్‌ ఫోన్‌ ఆడియో మెసేజ్‌లను పంపారు. ఇలా జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఫోన్లు, మెసేజ్‌లను పంపి ఒత్తిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క పేర్లు నమోదు చేయించుకుని, యోగాసనాలు చేసే వారికే తప్ప యోగా డేకి సాధారణ ప్రజలను అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెగేసి చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఎవరైనా ఫర్వా లేదు రండి రండి అంటూ జనాన్ని కూడగడుతుండడం విశేషం! మొత్తమ్మీద ఐదు లక్షల మంది హాజరును చూపించేందుకు అధికారులు నానా హైరానా పడుతున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.
Read More
Next Story