
యోగాసనాలకు రాకపోతే రూ.500 జరిమానా!
యోగా డే ఐదు లక్షల మంది జన సమీకరణకు అన్ని స్థాయిల్లోనూ అగచాట్లు. మీరు రాకపోతే ఇంట్లో వారినైనా పంపాలని డ్వాక్రా లీడర్లు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు.
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హాజరయ్యే ప్రోగ్రాములకు జనాన్ని తరలించడం ఎప్పడూ జరిగేదే. కానీ యోగా డే కార్యక్రమానికి కూడా ప్రజల్ని తోలుకెళ్లడానికి తంటాలు పడుతుండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. విశాఖలో శనివారం జరిగే అంతర్జాతీయ యోగా డేకు ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇంత పెద సంఖ్యలో జనాన్ని కూడకట్టే బాధ్యత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అప్పగించింది. దీంతో ఎవరి స్థాయిలో వారు యోగాసనాలకు తీసుకెళ్లే బాధ్యతను నెత్తిన వేసుకున్నారు. యోగా డేలో పాల్గొనే వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ మేరకు సంబంధిత అధికారులు ఆ పనిని మొదలు పెట్టారు. ఇలా రిజిస్టరు చేయించుకున్న వారంతా వస్తారో? రారోనన్న బెంగ పట్టుకోవడంతో వారికి నయానో, భయానో నచ్చచెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా రానిపక్షంలో ఇబ్బందులెదురువుతాయని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఈ యోగా డే కార్యక్రమానికి మహిళలను తీసుకొచ్చే బాధ్యతను డ్వాక్రా గ్రూపు లీడర్లకు అప్పగించారు. తమకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి వీరు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల నుంచి వీరు అదే పనిలో ఉన్నారు.
ప్రతీకాత్మక చిత్రాలు