ఏచూరి లేని లోటు తీర్చలేనిది
x

ఏచూరి లేని లోటు తీర్చలేనిది

దేశం క్లిష్టపరిస్ధితుల్లో ఉన్నపుడు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించటం చాలా బాధాకరమని రేవంత్ అన్నారు.


కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశం క్లిష్టపరిస్ధితుల్లో ఉన్నపుడు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించటం చాలా బాధాకరమని రేవంత్ అన్నారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభ రవీంద్రభారతిలో శనివారం ఉదయం జరిగింది. జమిలి ఎన్నికల రూపంలో దేశాన్ని బీజేపీ కబళించాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీని నిలువరించటానికి సీతారం లేకపోవటంతోనే ఆయన లోటు ఏమిటో తెలుస్తోందన్నారు. నమ్మిన సిద్దాంతాల కోసం చివరివరకు పోరాడిన వ్యక్తిగా ఏచూరిని రేవంత్ వర్ణించారు. సిద్ధాంతాలు చాలామంది ఉపన్యాసాల్లో చెబుతారని కాని వాటిని ఆచరణలో పెట్టేది మాత్రం సీతారాం లాంటి కొద్దిమంది మాత్రమే అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఏచూరిని రెండు, మూడుసార్లు కలిసిన విషయాన్ని రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు ఉద్యమం నుండి వచ్చిన బిడ్డలుగా ఏచూరితో తమ బంధం రక్తసంబంధమన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం చివరివరకు పోరాడిన ఏచూరి తమలాంటి వారికి ఆదర్శమన్నారు. ఎప్పుడు కండువాలు మార్చుతారో తెలీని ఈ కాలంలో కూడా ఏచూరి జీవితం స్పూర్తిదాయకం అని కేటీఆర్ చెప్పారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసమే ఏచూరి జీవించిన గొప్ప నాయకుడన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలన్నారు. ఓట్ల రాజకీయంలో వెనకబడినా ప్రజల కోసం పోరాటాలు చేయటంలో ముందుంటామని చాటిచెప్పిన వ్యక్తి ఏచూరిగా కేటీఆర్ వర్ణించారు. సంస్మరణ సభకు రేవంత్ వస్తున్నాడని తెలుసుకుని కేటీఆర్ తన ప్రసంగాన్ని క్లుప్తంగా చేసి సభ నుండి వెళ్ళిపోయారు. ఈ సభకు కోదండరామ్, తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, మోహన్ కందా, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లురవి, జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపి తదితరులు హాజరయ్యారు.

Read More
Next Story