ఎన్‌టీఆర్ జిల్లాలో వరదల పరిస్థితి ఎలా ఉందంటే..
x

ఎన్‌టీఆర్ జిల్లాలో వరదల పరిస్థితి ఎలా ఉందంటే..

రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలో పరిస్థితుల మరోలా ఉన్నాయి. దాదాపు నగరమంతా జలమయం అయింది.


రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలో పరిస్థితుల మరోలా ఉన్నాయి. దాదాపు నగరమంతా జలమయం అయింది. ఎక్కడ చూసినా.. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. దీంతో ప్రజల జనజీవనం నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు విజయవాడలో 327.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎన్‌టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ వర్షపాతం 329.7 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు జిల్లాలో ఐదుగురు ఎనిమిది మంది మరణించగా మరో ముగ్గురు గల్లంగయ్యారు. అదే విధంగా 63 పశువులు, 34,500 పౌల్ట్రీ నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. 72 ఎంఐ ట్యాంకులకు పగుళ్లు వచ్చినట్లు కూడా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 17 విద్యుత్ సబ్‌స్టేషన్‌లు దెబ్బతినగా, 33కిలోవాట్‌ల ఫీడర్ ఒకటి దెబ్బతిందని అధికారులు తమ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాకుండా 19 రోడ్లు నీటమునిగాయని, 19 ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

పంట నష్టం ఇలా..

ఎన్‌టీఆర్ జిల్లాలో పోటిత్తిన వరదల కారణంగా జిల్లా వ్యాప్తంగా 2,415 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోయిందని, అదే విధంగా 4,994 హార్టీకల్చర్ పంట కూడా దెబ్బతిందని వెల్లడించారు. విజయవాడ వ్యాప్తంగా 16 వార్డుల్ దెబ్బతిన్నాయి. 78 ప్రాంతాలు నీటమునిగాయి. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో 11,43,201 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 11,43,201 క్యూసెక్కులుగా ఉంది. ఈ వరదల కారణంగా రైల్వే లైన్స్ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాయనపాడు, కొండపల్లి స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్స్ వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రెండు స్టేషన్ల మధ్య రైలు సేవలను నిలిపివేయడం జరిగింది. దాదాపు 140 రైళ్లు రద్దు చేయగా, 97 రైళ్లు దారి మళ్లించబడ్డాయి.

సహాయక చర్యలు ఇలా

ఈ వరదల కారణంగా దాదాపు 2.76 లక్షల మంది ప్రభావితమయ్యారు. వారందరికీ సహాయక చర్యలు అందించడానికి 67 షెల్టర్లు సిద్ధం చేయబడ్డాయి. దాదాపు 11,567 మందిని షెల్టర్లకు తరలించడం జరిగింది. వారికి వైద్య సహాయం అందించడానికి 67 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ వరదల్లో సహాయక చర్యలు అందించడానికి 10 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కర్నూలు, నంద్యాల కోసం సిద్ధం చేసిన రెండు ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను అత్యవసర చర్యల్లో భాగంగా విజయవాడకు తరలించారు ఉన్నతాధికారులు. అదే విధంగా ఒడిశా నుంచి మూడు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడుకు చేరుకున్నాయి. వారంతా కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

వీటితో పాటుగా గల్లంతైన, చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, వారికి ఆహారం వంటి అందించడం కోసం ఆరు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా జీఓ 1 కోరింది. దాంతో పాటుగా 40 బోట్లు, పది ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక హెలికాప్టర్ విజయవాడకు చేరుకుని అక్కడ చర్యలను చేపట్టింది. ఇప్పటికే 53 బోట్లు విజయవాడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీటిలో 18 నాన్-మోటరైజ్‌డ్ కాగా 35 బోట్లు మోటరైజ్‌డ్‌వి. ఇవన్నీ కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ బోట్లు అబిజిత్ సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపుడి కాలనీ, అంబాపురం ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వీటితో పాటుగా కాకినాడ, ఏలూరు, ప్రకాశం నుంచి 56 బోట్లు విజయవాడకు వస్తున్నాయి. ఇవి మరికాసేపట్లో విజయవాడకు చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కృష్ణా, బాపట్ల జిల్లాల నుంచి మరో 64 బోట్లు విజయవాడకు వస్తున్నాయి. వీితో పాటుగా బోట్ల సహాయంతో చేపడుతున్న సహాయక చర్యల కోసం దాదాపు 301 మంది గజఈతగాళ్లను కూడా ప్రభుత్వం రంగంలోకి దించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వీటన్నింటితో పాటు బోటు ద్వారా రక్షించిన ప్రజలను, రైళ్ల ద్వారా విజయవాడకు వచ్చిన వారి కోసం రైల్వే స్టేషన్ల దగ్గర దాదాపు 159 బస్సులను సిద్ధంగా ఉంచారు అధికారులు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సహాయం కోసం సుమారు 2109 కాల్స్‌ను స్వీకరించామని అధికారులు చెప్పారు. కాల్స్ వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాలకు సహాయక బృందాలను పంపి వారికి తగిన సహాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు

Read More
Next Story