
ఎర్రబుక్ అంటే ఏడుపు ఎందుకు
ఎన్టీఆర్, చంద్రబాబులను ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్లు అంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
రెడ్బుక్ గురించి మంత్రి నారా లోకేష్ మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎర్రబుక్ అంటే వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుస్తున్నారని, రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్లకి ఎందుకు అంత ఏడుపు అంటూ లోకేష్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడే రెడ్ బుక్ గురించి చెప్పానని, చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలు, నాయకుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి పేర్లు రెడ్బుక్లో రాస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని నాడే చెప్పామని, నేడు అదే చేస్తున్నామని లోకేష్ అన్నారు. రెడ్ కలర్ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిద్ర రావడం లేదని ఎద్దేవా చేశారు. రెడ్బుక్ అంటే ఒక వైసీపీ నాయకుడికి గుండెపోటు వచ్చిందని, మరొకరికి కాలు విరిగిందని, మరొకరికి ఏమైందో అందరికీ తెలుసని, అర్థమైందా రాజా అంటూ లోకేష్ మాట్లాడారు.
ఎన్టీఆర్, చంద్రబాబులు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్లని ఇద్దరిని పోల్చుతూ లోకేష్ మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధికి ఇద్దరు బ్రాండ్లుగా నిలిచారని అన్నారు. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని.. ఒక ప్రభంజనమని అన్నారు. ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో దేవుడని పేర్కొన్నారు. గత ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ను అప్పులప్రదేశ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. అలాంటి అప్పుల ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందే రాష్ట్రంగా చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. త్వరలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను కూడా అమలు చేస్తామన్నారు. మిషన్ రాయలసీమ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనేక పరిశ్రమలు తీసుకుచ్చేందుకు పని చేస్తున్నామన్నారు.
ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా రూ. 140 కోట్లు టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్నామని వెల్లడించారు. పార్టీలో అందరికీ సమానమైన గౌరవం ఉంటుందన్నారు. జగన్ ఏనాడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవరని, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని డోర్లు క్లోజ్ చేసుకుంటారని, టీడీపీలో అలా కాదని, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటామని లోకేష్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా అవసరమని, అలా ఎక్కువ సంత్సరాలు కొనసాగితేనే ఏపీకి ప్రజలకు ప్రయోజనాలు ఉంటుందన్నారు.
Next Story