బయట వాన, లోన ఉక్క , ఉడికి పోయిన విజయవాడ...
x

బయట వాన, లోన ఉక్క , ఉడికి పోయిన విజయవాడ...

విజయవాడ నగరంలో ఆదివారం రాత్రంతా సామాన్యులు, అంటే ‘ఏసీ’ లేని వారు జాగారం చేశారు.


విజయవాడ నగరంలో ఆదివారం రాత్రంతా ప్రజలు జాగారం చేశారు. ప్రధానంగా సామాన్యులు దోమపోటు, ఉక్కపోత, చెమటతో అల్లాడారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి వర్షం మొదలైంది. ఒక మోస్తరు వర్షం నమోదైంది. అయితే రాత్రి అంతా పూర్తి స్థాయిలో వర్షం కురవడంతో పాటు ఈదురు గాలులు వీచాయి. బయట చిత్తడిగా ఉన్నా, ఇల్లలో ఉక్కపోత. జనం అల్లాడి పోయారు. వాతావరణ శాఖ వారి వివరాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకు 30 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

రోడ్లలో వీధిలైట్లు లేక పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. రాత్రి 7 గంటల నుంచి వర్షం మొదలు కావడంతో చాలా మంది ప్రజలు వేగంగా ఇండ్లకు చేరుకున్నారు. కంటిన్యూగా చినుకులు పడుతూనే ఉన్నాయి.


వర్షం కురిసే సమయంలో 15 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో సాధారణ గాలులు వీస్తాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే పగటి పూట నమోదవుతున్న ఉష్ణోగ్రత రాత్రి పూట నమోదు కావడంతో ఉక్కపోతను ప్రజలు తట్టుకోలేక పోయారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఈ పరిణామాలు సంభవించాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే నగరంలో ప్రజలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం నగరం వరకు వర్షం పరిమితమైందా? చుట్టుపక్కల కూడా ఉందా? అనేది ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ విచారిస్తే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఆదివారం రాత్రి 7 గంటల తరువాత ప్రజలు రోడ్లపైకి రాలేకపోవడంతో ఆదివారం అయినా అన్ని షాపులు మూత పడ్డాయి. సాధారణంగా ప్రధాన మైన దుకాణాలు మూసి వేస్తారు. కొన్ని కిరాణా, ఇతర దుకాణాలు మాత్రమే ఉంటాయి. అవి రాత్రి పది గంటల తరుతా మూత పడతాయి. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా పూర్తి స్థాయిలో నగరంలోని దుకాణాలు మూత పడ్డాయి.

విజయవాడ నగరంలో నిత్యం రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డు ఆరు గంట నుంచి ఏడు గంటల లోపు నిర్మానుష్యంగా మారింది. పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రి అయ్యే సరికి సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిసే కనీసం పది శాతం పడిపోతాయి. అయితే ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏ ఉష్ణోగ్రత లైతే ఉన్నాయో అవే ఉష్ణోగ్రతలు రాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి.


ప్రధానంగా నగరం చుట్టుపక్కల ప్రాంతాలైన మంగళగిరి, తాడేపల్లి, కంకిపాడు, ఎనికేపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలం, నున్న, ఇబ్రహీంపట్నం మండలం వంటి ప్రాంతాల్లోనూ వర్షం భారీగా నమోదైంది. హైదరాబాద్ వైపు వెళ్లే వారు కానీ, మచిలీపట్నం, విశాఖపట్నం, చెన్నై వైపు వెళ్లే వారు కూడా విజయవాడలో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వార్త ఇచ్చే సమయానికి కూడా విజయవాడలో జోరుగా వర్షం కురుస్తూనే ఉంది. ఉక్కపోత తగ్గలేదు.

ఎప్పుడూ లేనంతగా రాత్రుల్లో ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఏ విధమైన విపత్తు సంభవిస్తుందోననే భయంలో ఆదివారం ప్రజలు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడలో సాధారణంగా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ ఉక్కపోత మాత్రం ఆగదు. విశాఖలో ఉప్పునీటి ద్వారా శరీరం ఎలాగైతే జిడ్డు పడుతుందో అలాగే విజయవాడలో జిడ్డు లేకపోయినా చెమటతో కూడిన వేడితో చిరాకు పుట్టిస్తుంది. మనిషి బయటకు వెళితే సాధారణంగా ఇంటికి చేరుకునే పరిస్థితి లేదు. చెమట పట్టడంతో పాటు శరీరంపై పొగలు వెల్లగక్కుతూ ఉంటాయి.

ఇక ఆదివారం రాత్రి నమోదైన ఉష్ణోగ్రత నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతూ రాత్రంతా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిద్ర పోతున్న సమయంలో ఉలిక్కి పడి లేస్తే బయట వర్షం చినుకులు పడుతూ చూరు నీటీ బొట్ల శబ్ధం విని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read More
Next Story