గెలుపు ధీమాలో పురందేశ్వరి
x

గెలుపు ధీమాలో పురందేశ్వరి

రాజమహేంద్రవరం నుంచి బిజెపి అభ్యర్థిగా ఎన్‌డిఎ కూటమి నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు ధీమాలో ఉన్నారు.


రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు ధీమాలో ఉన్నారు. ఎన్నికలు ముగియగానే ఆమె తన అనుచరులతో రాజమహేంద్రవరంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెజారిటీ ఎంత రవొచ్చనే లెక్కలు వేశారు. సుమారు లక్ష ఓట్ల మెజారిటీ రావచ్చనే ధీమాను వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి బిజెపి, టిడిపి, జనసేన కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి రగంలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మొదటిసారిగా ఎన్నికల రంగంలోకి దిగారు. ఈయన రాజమహేంద్రవరంలో పేరున్న డాక్టర్‌. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మార్గాని భరత్‌ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టిక్కెట్‌ కాకుండా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే టిక్కెట్‌ వైఎస్సార్‌సీపీ ఇచ్చింది. గతంలో వైఎస్సార్‌సీపీ సిటీ కో ఆర్డినేటర్‌గా ఉన్న గూడూరి శ్రీనివాసులును ఎంపిగా రంగంలోకి దించింది. కాంగ్రెస్‌ తరపున పోటీకి దిగిన పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా తన బలాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనతో బాగానే క్యాంపెయిన్‌ చేశారు. కాంగ్రెస్‌ అభిమానుల ఓట్లు తప్పకుండా ఆయనకు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఓట్లు వైఎస్సార్‌సీపీ నుంచి చీలే అవకాశాలు కూడా లేకపోలేదని స్థానికులు చెప్పారు.

బిజెపి అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరికి రాజమహేంద్రవరం సీటు ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేసిన బిజెపి చంద్రబాబును ఒప్పించి రాజమహేంద్రవరం నుంచి పోటీకి దించారు. గతంలో రెండు సార్లు బిజెపి ఇక్కడి నుంచి ఎంపి అభ్యర్థి గెలిచారు. ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ గెలిచినా టిడిపీ కూడా గెలిచింది. రూరల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉందని చెబుతుంటారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం రూరల్‌ తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై పోటీలో ఉన్నారు. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం పట్టణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం (ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి.
గోపాలపురం నుంచి తానేటి వనిత, రాజమండ్రి రూరల్‌ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ మంత్రులు అయితే వీరు ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నాని ప్రచారం జరుగుతోంది. రాజానగరంలో జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి జక్కంపూడి రాజా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముండ్రు వెంకట శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. శ్రీనివాస్‌ కూడా ఓట్లు ఎక్కువగానే చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు కూడా కష్టకాలమేననే ప్రచారం సాగుతోంది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణకు గెలుపు అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. నిడదవోలులో కూడా కందుల దుర్గేష్‌కు అనుకూల పవనాలు వీస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోలింగ్‌లోనూ జెఎస్‌పి అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు పోలయినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితులను బట్టి పరిశీలిస్తే దగ్గుబాటి పురందేశ్వరి గెలుపు బాటలో ఉన్నారనే చర్చ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్‌ కూడా 80.93శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 16,23,149 ఓట్లలో 13,13,630 ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలోనే వినియోగించుకున్నారని చెప్పొచ్చు.
Read More
Next Story