
మావోయిస్టు నేత పెద్ద కర్మ మీద పోలీసుల ఆంక్షలు
చావు తర్వాత కూడా తప్పని నిర్బంధం.
మావోయిస్టు నేత నంబాల కేశవరావు పెద్దకర్మపై ఆంక్షలు విధించడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మే 21న గుండెకోట్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుకి ఆయన కుటుంబ సభ్యులు తమ ఆచారాల ప్రకారం ఇంట్లో నిర్వహిస్తున్న పెదకర్మ మీద పోలీసులు ఆంక్షలు విధించడం దారుణమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పీ ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత నంబాల కేశవరావు మృతదేహం కోసం చేసిన ప్రయత్నాలతో పాటు ఆయన చితాభస్మం కోసం కూడా చివరి వరకూ కూడా వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అవన్నీ విఫలం అయ్యాక హిందూ మత ధార్మిక పద్ధతుల ప్రకారం జూన్ 1వ తేదీ ఆదివారం వారి స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేటలో పెదకర్మను నిర్వహిస్తున్నారు.
వారి మత ధార్మిక కార్యక్రమం మీద కూడా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని వారి బంధుమిత్రుల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. వారి కుటుంబ సమీప బంధువులు తప్ప రేపటి పెద్దకర్మకు ఎవరూ హాజరు కావడానికి వీలు లేదని వారి మీద తీవ్రంగా ఒత్తిళ్ళు తెస్తున్నారని తెలిసిందని ఇది అన్యాయమని పేర్కొన్నారు. కేశవరావు అన్నయ్య ఢిల్లీశ్వరరావు అండమాన్ చీఫ్ పోర్ట్ అడ్మినిస్ట్రేటర్ గా చేసి పదవీ విరమణ పొందిన అధికారని, ఆయనకు ప్రభుత్వ మాజీ అధికారిగా సమాజంలో గుర్తింపు, గౌరవం ఉుందన్నారు. ఆయన తమ్ముడు రాంప్రసాద్కి కూడా కాంట్రాక్టర్ గా పని చేసిన నేపథ్యం వుందని, ఆయనకు కూడా సమాజంలో పేరు, మర్యాదలు ఉన్నాయన్నారు. అలాంటి మంచి పేరు, గౌరవ మర్యాదలు, గుర్తింపులు కలిగిన ఆ సోదరులకు సమాజంలో చాలా విస్తృత సంబంధాలు ఉంటాయి. అసంఖ్యాక మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కూడా ఉంటారని పేర్కొన్నారు.
కానీ కేవలం రక్త సంబంధీకుల వరకే అనిమతిస్తామని, వారిని తప్ప.. బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులను ఆహ్వానించడానికి వీలు లేదని ఆదేశించడం అన్యాయమని పేర్కొన్నారు, వాస్తవానికి వారు సంతాప సభలు గానీ సమావేశాలు కానీ ఏమీ నిర్వహించకుండా పెదకర్మగా నిర్వహించుకుంటున్నా కూడా ఇలా అంక్షలు విధించడం దుర్మార్గమని అన్నారు. హిందూ మతాచారం ప్రకారం జరుపుకుంటున్న ఆధ్యాత్మిక కార్యక్రమం మీద ఇలాంటి ఆంక్షలు విధించడాన్ని సీపీఐ(ఎంఎల్) తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లండిచారు. దీనిని తక్కిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులకు ఖండించాలని సీపీఐ(ఎంఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధులు పీ ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story