
విజయవాడలో సిమి సానుభూతి పరులు..గాలింపులు చేపట్టిన పోలీసులు
దాదాపు 10 మంది సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో విజయవాడ పోలీసులు అలెర్ట్ అయ్యారు. భారత దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన పహల్గాం దాడి నేపథ్యంలో విజయవాడలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారం విజయవాడలో కలకలం రేపింది. దీంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ నగరంలో నలుగురు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) సానుభూతిపరులు ఉన్నట్లు విజయవాడ పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు సిమి సానుభూతి పరులను అదుపులోకి తీసుకునేందుకు విజయవాడ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే దీనిపై కేంద్ర నిఘా వర్గాలు ఇది వరకే విజయవాడ పోలీసులను హెచ్చరించినట్లు సమాచారం. విజయవాడలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన హెచ్చరికలతో పాటు వాటికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర నిఘా వర్గాలు దాదాపు రెండు నెలల క్రితమే విజయవాడ పోలీసులను హెచ్చరించినట్లు సమాచారం. దీనికి తోడు మంగళవారం కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. విజయవాడకు ఆనుకొని ఉన్న గొల్లపూడి, అశోక్నగర్, నగరంలోని లబ్బీపేటలో గాలింపులు చేపట్టారు.
పోలీసులు జరిపిన గాలింపుల్లో మొత్తం పది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో నలుగురిని విజయవాడ నగరంలోను, మరో ఆరుగురిని విజయవాడ శివారు ప్రాంతాంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిని విజయవాడ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఏసీ మెకానిక్ పనులు, భిక్షాటనలు, బడ్డీ కొట్లలో పనులు చేసుకునే వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Next Story