వైసీపీ నేతలు–కూటమి కేసులు
x

వైసీపీ నేతలు–కూటమి కేసులు

ఎంత మంది వైసీపీ నేతల మీద కేసులు పెట్టారో జగన్‌ వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వం దిగిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తమ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ తప్పుడు కేసులకు.. అక్రమ అరెస్టులకు తాము భయపడేది లేదని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం జగన్‌ మాట్లాడుతూ తమ నాయకుల మీద పెడుతున్న అక్రమ కేసుల మీద ఆయన ధ్వజమెత్తారు. తమ నాయకులపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపైన కూడా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని మండిపడ్డారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత మంది వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులపైన కేసులు పెట్టారో వాటి వివరాలు వెల్లడించారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, అతని భార్య బేబీ, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, అతని భార్య జయసుధ, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి జోగి రమేష్, అతని కొడుకు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవ్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, అతని కొడుకు వైవీ విక్రాంత్‌రెడ్డి, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి ఉషాచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, గౌతం రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కొడుకులతో పాటు ఇంకా పలువురిపైన తప్పుడు కేసులు పెట్టారని జగన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీరు కాకుండా సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును కూడా అక్రమంగా అరెస్టు చేశారని, అయితే సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబు చెంప చెళ్లు మనిపించే విధంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఎంత మందిపైన తప్పుడు కేసులు పెట్టినా, ఎంత మందిని అక్రమంగా అరెస్టు చేసినా.. ప్రశ్నించడం మానమని, ప్రశ్నిస్తూనే ఉంటామని, కేసులకు భయపడేది, బెదిరేది లేదని జగన్‌ స్పష్టం చేశారు.
Read More
Next Story