
అంబటి మీద పోలీసు కేసు
మరో వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ మాజీ మంత్రి మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసుల నమోదు కొనసాగుతోంది. తాజాగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాని, అనుమతులు లేకుండా వెన్నుపోటు దినం ర్యాలీలు తీశారని అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, అబద్దపు హామీలతో మభ్యపెట్టి ఓట్లేయించుకుని ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని జూన్ 4 బుధవారం వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. అందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో గుంటూరులో ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలకు అనుమతుల్లేవని పోలీసులు చెప్పారు. మేము ఎవ్వరికీ ఆటంకాలు కలిగించకుండా ర్యాలీలు, నిరసనలు తెలుపుకుంటున్నామని, దీనిని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు చెప్పే ప్రయత్నం చేశారు. దీనిని వినకుండా పోలీసులు ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.
ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీని అడ్డుకుంటామని, నువ్వు ఎలా వెళ్తావో చూస్తామంటూ అంబటి మీద సీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ర్యాలీ ఆపు అంటూ అదే స్థాయిలో అంబటి రాంబాబు సీఐని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాసేపు మాటామాట పెరిగింది. ఈ క్రమంలో పక్కన ఉన్న సిబ్బంది ఇద్దరికి సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు. తర్వాత సజావుగానే ర్యాలీ కొనసాగింది. వైసీపీ శ్రేణులతో కలిసి కంకరగుంట ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లి కలెక్టరేట్కు చేరుకుని వినతి పత్రం సమర్పించారు. అయితే మాజీ మంత్రి రాంబాబు, సీఐ వెంకటేశ్వర్లుకు మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Next Story