రాష్ట్ర ఆకాంక్షలు ముఖ్యం
గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాష్ట్రం త్వరలోనే కృత్రిమ మేధస్సు, ఇన్నోవేషన్ హబ్‌గా మారనుంది. సదస్సులో ఈ అంశాలు, రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలి. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున... వేగంగా పనులు పూర్తి చేయాలి. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
విశాఖలో 4వ సారి సీఐఐ సదస్సు
సీఐఐ భాగస్వామ్య సదస్సు నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహించడం ఇది 4వ సారి. గతంలో 2016, 2017, 2018లో మూడు సార్లు విశాఖలోనే నిర్వహించారు. ఇప్పుడు విశాఖనే సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈసారి సీఐఐ సదస్సు ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్’ థీమ్‌తో మొత్తం 13 సెషన్లుగా జరగనుంది. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
ఇవీ సెషన్లు
జియోఎకనామిక్ ఫ్రేమ్ వర్క్, టెక్నాజజీ-ఇన్నోవేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్-సప్లయ్ చైన్, సస్టెయినబిలిటీ-క్లీన్ ఎనర్జీ, లెవరేజింగ్ టెక్నాలజీ అంశాలపై సెషన్లు జరుగుతాయి. అయితే ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలుదేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించడంతో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ పాల్గొన్నారు.