పవన్ పట్టు... బయట పడ్డ రఘురామ గుట్టు!
x
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పవన్ పట్టు... బయట పడ్డ రఘురామ గుట్టు!

జనసేన పంతం నెగ్గించుకుంది. భీమవరం 'పోలీస్' పంచాయితీ కి చెక్ పడింది.


ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో "అధికార పంపిణీ", "క్షేత్రస్థాయి ఆధిపత్యం" ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ వ్యవహారమే నిదర్శనం. కేవలం ఒక పోలీసు అధికారి బదిలీగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంతం, జనసేన శ్రేణుల అసంతృప్తి, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజు అనుచర గణంపై పట్టు సాధించే వ్యూహం దాగి ఉన్నాయి.

పేకాట క్లబ్బులు.. సివిల్ సెటిల్మెంట్లు!

భీమవరం సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల కంటే 'పేకాట శిబిరాల' నిర్వహణే ప్రధాన అజెండాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల కనుసన్నల్లోనే ఈ క్లబ్బులు నడుస్తున్నాయని, అందులోనూ కేవలం ఒక వర్గానికి (ప్రధానంగా టీడీపీలోని కొందరికి) మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, జనసేన కార్యకర్తలను 'కుక్కిన పేనుల్లా' పడి ఉండాలని శాసిస్తున్నారన్నది ప్రధాన ఫిర్యాదు. ముఖ్యంగా డీఎస్పీ జయసూర్య.. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ రాజుకు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడటం, ఆయన అండతో జనసేన నాయకులను విస్మరించడం చివరకు పవన్ కల్యాణ్ వద్దకు చేరింది.

పవన్ కల్యాణ్ ఎంట్రీ.. నివేదికతో గురి!

జనసేన క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిడిని గమనించిన పవన్ కల్యాణ్ ఈసారి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారు. నేరుగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో మాట్లాడి, డీఎస్పీ పనితీరుపై నివేదిక కోరడం ద్వారా తన 'పవర్' ఏంటో చూపించారు. "కూటమిలో భాగస్వాములైనంత మాత్రాన ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు భరించాల్సిన అవసరం లేదు" అనే సంకేతాన్ని పవన్ ఈ చర్య ద్వారా బలంగా పంపారు.

జనసేనలో చల్లబడ్డ సెగ

ఉండి, భీమవరం వంటి నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిపత్యం పెరిగిపోతోందని, జనసేన ఉనికి ప్రమాదంలో పడుతోందని భావిస్తున్న క్యాడర్‌కు ఈ బదిలీ ఊరటనిచ్చింది. డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం అంటే.. రఘురామ కృష్ణ రాజు మార్క్ రాజకీయానికి బ్రేక్ వేయడమేనని స్థానిక టాక్. రఘువీర్ విష్ణు రాకతోనైనా భీమవరంలో రెండు పార్టీల మధ్య సమన్వయం కుదురుతుందా? లేక ఈ పంతాలు మరిన్ని బదిలీలకు దారితీస్తాయా? అన్నది వేచి చూడాలి.

ఎట్టకేలకు పవన్ కల్యాణ్ పట్టుబట్టి జయసూర్యను సాగనంపడంలో విజయం సాధించారు. ఇది జనసేన కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపినప్పటికీ, కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ-జనసేన మధ్య క్షేత్రస్థాయిలో 'ముసలం' ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Read More
Next Story