పోలింగ్ లో పవన్ కల్యాణే టాప్!
x

పోలింగ్ లో పవన్ కల్యాణే టాప్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ముగ్గురు.. రాజకీయ ప్రత్యర్థులు.. మూడు నియోజకవర్గాలు.. ప్రచారంలోనే కాదు ఓటింగ్ లోనూ పోటీ పడ్డారు.


ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ముగ్గురు.. రాజకీయ ప్రత్యర్థులు.. మూడు నియోజకవర్గాలు.. ప్రచారంలోనే కాదు ఓటింగ్ లోనూ పోటీ పడ్డారు. ఒకర్ని మించి ఒకరు ఓట్లు సంపాయించుకోబోతున్నారు. ఏపీలో పోలింగ్ శాతం 81కి పెరగవచ్చనంటున్నారు ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా. ముఖ్యమంత్రి వైఎస్ సొంతగడ్డ పులివెందుల. జగన్ మోహన్ రెడ్డికి 81.06% ఓటింగ్ నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం. ఇక్కడ 85.87% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్. ఆయన నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. అక్కడ రికార్డు స్థాయిలో 86.87 శాతం పోలింగ్ నమోదైంది.

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 2024 మే 13న ఎన్నికలు జరిగాయి. చెదురుమదురు సంఘటనల మధ్య జరిగిన పోలింగ్ లో సుమారు 81 శాతం ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మే 13 ఉదయం 6 గంటలకు మొదలైన పోలింగ్ అర్థరాత్రి దాటి తేది మారిపోయినా ఓటర్లు బారులు తీరి ఓట్లు వేస్తూనే వచ్చారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్‌ ముగియాల్సి ఉన్నప్పటికీ ఆ సమయానికి పోలింగ్ బూత్‌ల వద్ద క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించారు. పోలింగ్ శాతం ఎంత అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రముఖుల నియోజకవర్గాలలో పోలింగ్ ను అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం 1.2% ఓటింగ్‌తో సహా మొత్తం పోలింగ్ శాతం 79.4%గా అంచనా వేసినా అదింకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మొత్తం డేటాను కలిపిన తర్వాత తర్వాత పోల్ శాతం 81కి పెరగవచ్చునని ఎన్నికల సంఘం రాష్ట్ర సీఇవో మీనా చెప్పారు.


2019 ఎన్నికల్లో 79.8% ఓటింగ్ నమోదైంది. ఇందులో 0.6% మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. 2024 లెక్కల ప్రకారం రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో అమలాపురంలో అత్యధికంగా 83.19% ఓటింగ్ నమోదైంది. విశాఖపట్నంలో అత్యల్పంగా 68% నమోదైంది. ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో అనకాపల్లి (78.47%), అనంతపురం (78.50%), అరకు (69.26%, బాపట్ల (82.90%), చిత్తూరు (82.36%), ఏలూరు (83.04%), గుంటూరు (75.74%), హిందూపూర్ (75.74%), 81.38%), కడప (78.72%), కర్నూలు (76.17%), మచిలీపట్నం (82.20%), నంద్యాల (79.60%), నర్సాపురం (82.20%), నరసరావుపేట (78.70%), నెల్లూరు (77.38%), ఒంగోలు (81.8%) ), రాజమండ్రి (79.31%), రాజంపేట (76.71%), శ్రీకాకుళం (73.67%), తిరుపతి (75.72%), విజయవాడ (78.76%), విజయనగరం (80.06%) ఓటింగ్ నమోదైంది.

కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పులివెందులలో ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి 81.06% ఓటింగ్ నమోదైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు స్వస్థలమైన కుప్పంలో 85.87% ఓటింగ్ నమోదైంది.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 86.87 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో 79.20% ఓటింగ్ నమోదైంది. రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 84.39% ఓటింగ్ నమోదైంది.

Read More
Next Story