
TIRUMALA || పవిత్రోత్సవాలకు తిరుమల సర్వం సిద్ధం..!
ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ఆగస్టు 4న అంకురార్పణతో ప్రారంభమవుతాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికులు లేదా సిబ్బంది ద్వారా తెలిసిగానీ, తెలియకుండాగానీ జరిగే దోషాల నివారణ కోసం, ఆలయ పవిత్రతను కాపాడటం కోసం ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15, 16వ శతాబ్దాల నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి తిరుమల దేవస్థానం ఈ ఉత్సవాలను తిరిగి ప్రారంభించింది.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
ఆగస్టు 5: పవిత్రాల ప్రతిష్ట
ఆగస్టు 6: పవిత్ర సమర్పణ
ఆగస్టు 7: పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి.
ఆర్జిత సేవలు రద్దు
పవిత్రోత్సవాల కారణంగా కొన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది.
ఆగస్టు 4న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవ రద్దు చేయబడింది.
ఆగస్టు 5న అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేయబడింది.
ఆగస్టు 7న తిరుప్పావడ సేవ రద్దు చేయబడింది.
అలాగే, ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు అయ్యాయి.