మక్కెలు ఇరొగ్గొట్టి కూర్చోబెడతాం– జగన్‌కు పవన్‌ మాస్‌ వార్నింగ్‌
x

మక్కెలు ఇరొగ్గొట్టి కూర్చోబెడతాం– జగన్‌కు పవన్‌ మాస్‌ వార్నింగ్‌

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తే కఠినమైన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాజీ సీఎం జగన్‌ను హెచ్చరించారు.


నరుకుతాం.. చంపుతాం.. పీకలు కోస్తాం అంటూ మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడినా.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా.. పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఉపేక్షించేది లేదని మక్కెలిరగ్గొట్టి కూర్చోబెడుతామని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వైసీపీకి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వమని, చేతకాని ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మాదిరిగా తాము కూడా మాట్లాడగలమని, అయితే తమకు సంస్కారం ఉందన్నారు. సినిమా డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయని, తాను సినిమా నుంచి వచ్చిన వాడినేనని, బయట వాటిని మాట్లాడటం మంచిది కాదన్నారు.

ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని ఇంత దూరం వచ్చానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం చంద్రబాబు వంటి విజన్‌ ఉన్న నాయకుడు మరో 25 ఏళ్ల పాటు ఏపీకి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని, దాని కోసం తాము కూటమిగానే కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూటమి నుంచి తాము విడిపోయే పరిస్థితి లేదన్నారు. రానున్న రోజుల్లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేది కూటమేనని, వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదని, ఇక రాబోదని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రతిపక్షంలో లేనప్పటికీ వైసీపీ రౌడీయిజం ఏమాత్రం మారలేదన్నారు. వారి కార్యక్రమాల తీరు కూడా ఏ మాత్రం మారలేదన్నారు. ప్రజాస్వామ్య విధానాలపై వారికి గౌరవం లేదన్నారు. విదేశాల్లో ఉన్న వెంటాడుతామని చెప్పడం దీనికి నిదర్శనమన్నారు. పనిమాలిన బెదిరింపులు, పిచ్చి బెదిరింపులు చేయొద్దని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వం వస్తే ఎమవుతుందో అని చాలా మంది అధికారుల్లో ఈ భయం ఉందని, ఇక వైసీపీ రాదు.. రాబోదన్నారు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసం తాము కూటమిగా మరో 25 ఏళ్ల పాటు కలిసి ఉండాలని మాట్లాడుకుని నిర్ణయించుకున్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోసం కలిసి ఉండాలనుకుంటున్న తాము కూటమి నుంచి విడిపొయ్యేందుకు సిద్ధంగా లేమన్నారు. దీనిని వైసీపీ వాళ్లు కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు.
Read More
Next Story