మోదీ టూర్‌కు నిర్వాహక కమిటీ ఏర్పాటు
x

మోదీ టూర్‌కు నిర్వాహక కమిటీ ఏర్పాటు

విశాఖపట్నంలో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ టూర్‌ ఏర్పాట్ల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి ఆంధ్రప్రదేశ్‌లో టూర్‌ చేయనున్నారు. ఇటీవల అమరావతి నిర్మాణాల పునఃప్రారంభానికి వచ్చిన ప్రధాని మోదీ, ఈ సారి విశాఖకు రానున్నారు. జూన్‌ 21న విశాఖ సముద్ర తీరంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన కోసం ప్రత్యేకంగా ఒక నిర్వాహక కమిటీని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో ఒక నిర్వాహక కమిటీని ఏర్పాటు చేసింది. హోం మంత్రి అనితతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయులు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్‌లను నిర్వాహక కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ఏర్పాటు చేశారు. జూన్‌ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా డే ఉత్సవాలతో పాటు ప్రధాని మోదీ టూర్‌ ఏర్పాట్లన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలోనే సాగనున్నాయి.

జూన్‌ 21న అంతర్జాతీయ యోగాడే ఉత్సవాలు, ప్రధాని టూర్‌ల మీద సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌..వన్‌ హెల్త్‌ ’ను ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్‌గా నిర్ణయించినట్లు తెలిపారు. యోగాంధ్ర–2025 థీమ్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా మంత్‌ పాటించాలన్నారు. నెల రోజులు పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తించి సర్టిఫికేట్లు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
విశాఖ తీరంలోని ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి బీచ్‌ వరకు అన్ని చోట్లా ప్రజలు, స్థానికులు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 2.5 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎంకు తెలిపారు. బీచ్‌ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 68 ప్రాంతాలను గుర్తించామని, వాటిల్లో 2,58,948 మంది యోగ సాధన చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఐదు లక్షల మందితో యోగాడే నిర్వహించాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More
Next Story