
సౌదీ నుంచి ఆదేశాలు.. విజయనగరంలో టిఫిన్ బాక్స్ బాంబుల తయారీ
పలుమార్లు రంపచోడ వరం ఫారెస్ట్ ప్రాంతంలో బాంబుల పేలుడు రిహార్సల్స్ కూడా నిర్వహించారు.
విజయనగరం ఉగ్రమూకల కుట్రల కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్లు సౌదీ అరేబియాకు చెందిన ఐసిస్ నుంచి అందించిన ఆదేశాల మేరకు టిఫిన్ బాంబుల తయారీలోను, వాటి పని తీరును పరీక్షించడంలోను తలమునకలై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు రిహార్సల్స్ కూడా చేసినట్లు గుర్తించారు. బాంబుల అంశానికి సంబంధించి సిరాజ్ అనే నిందిడుతు గత ఆరు నెలల్లో మూడు సార్లు సౌదీ వెళ్లి వచ్చినట్లు వివరాలను సేకరించారు. పోలీసుల సేకరించిన అన్ని వివరాల మేరకు నిందితులు సిరాజ్, సమీర్లను కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు నిందితులు సిరాజ్, సమీర్లపైన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాల గుర్తించి ప్రస్తావించినట్లు తెలిసింది.
విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, సికింద్రాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్లు కలిసి ఆల్హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా దీనిని నడిపిస్తున్నారు. సమీర్, సిరాజ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఇన్స్టాగ్రూపుకు చెందిన ఆరుగురు వ్యక్తులు మూడు రోజుల పాటు హైదరాబాద్లో కలిసే ఉన్నారు. సౌదీ అరేబియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ నుంచి వీరికి ఇది వరకే వచ్చిన టిఫిన్ బాంబుల తయారీకి సంబంధించిన ఆదేశాల గురించి వీరు చర్చించుకున్నారు. సిరాజ్, అమీర్లకు బాంబులను తయారు చేయాలని, తక్కిన నలుగురు ఆ బాంబులు పెట్టి పేల్చే టార్గెట్లను గుర్తించాలని అక్కడ నుంచి ఆదేశాలు వీరికి అందాయి.
బాంబులు ఎలా తయారు చేయాలి, మెటీరియల్ను ఎక్కడ నుంచి కొనుగోలు చేయాలి, ఎక్కడ వాటిని రిహార్సల్స్ చేయాలనే కీలక అంశాలపైన డిస్కస్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాంబుల తయారీకి అవసరమైన పేడులు మెటీరియల్ను ఎవరికీ అనుమానాలు రాకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు. అంతకు ముందు నుంచి వీటి మీద అవగాహన కోసం యూట్యూబ్ను ఆశ్రయించే వారు. యూట్యూబ్ వీడియోలను చూసి పేలుడు పదర్థాల తయారీ విధానం మీద అవగాహన పెంచుకున్నారు.
ఈ నేపథ్యంలో వీరు బాంబుల తయారీ, వాటి రిహార్సల్స్ మీద నిమగ్నమయ్యారు. తయారు చేసిన వాటి పనితీరును తెలుసుకునేందుకు రంపచోడవరం అటవీ ప్రాంతంలో రిహార్సల్స్ కూడా చేపట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్ఐఏ అధికారులు సిరాజ్ను అరెస్టు చేసిన సమయంలో అతని వద్ద పెద్ద ఎత్తున భారీ పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన తక్కిన వివరాల కోసం విజయనగరం రెండో పట్టణ పోలీసులను కూడా ఎన్ఐఏ అధికారులు కలిశారు. అక్కడ వారితో చర్చించి మరి వివరాలను తెలుసుకున్నారు.
అదుపులో ఉన్న మరో నిందితుడు సమీర్ కాంటాక్ట్ వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తన తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్న సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీలోని సమీర్ నివాసం వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టారు. 29 ఏళ్ల సిరాజ్ బీటెక్ ఇంజనీరింగ్ చదవగా, సమీర్ లిఫ్ట్ మెకానిక్గా పని చేస్తున్నారు. సిరాజ్ పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోల కోసం కూడా ప్రయత్నాలు చేశాడు. ఇతని సోదరుడు, తండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నారు. సమీర్ హైదరాబాద్లోని ఓ మదరసాలో ఏడో తరగతి చదివాడు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికీ పరిచయమైంది. సిరాజ్ ప్రోబ్బలంతో సమీర ఈ గ్రూప్లో చేరాడు. వీరిద్దరిని ఆదివారం విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రమూకలను గుర్తించేందుకు నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రగ్రూపులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నారనే సమాచారంతో గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు వంటి కొన్ని జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
Next Story