
చెన్నై లో స్టార్ ఎట్రాక్షన్ పవన్ కళ్యాణ్
తమిళనాట వన్ నేషన్.. వన్ ఎలక్షన్ గురించి అబద్ధపు ప్రచారం సాగుతోంది: పవన్ కళ్యాణ్
‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ దేశానికి చాలా అవసరమైన మార్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు సోమవారం చెన్నైలోని తిరువాన్మియూర్ లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్ వన్ ఇండియా తమిళనాడు సమన్వయకర్త తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరిగింది.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు అనేవి ఒక నిరంతర ప్రక్రియలా మారిపోయి. దేశ ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. తరచూ ఎన్నికల నిర్వహణతో భారీగా ఖర్చుతోపాటు సమయం వథా అవుతోందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు స్తంభించిపోతుందని, తద్వారా అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోతుందని అన్నారు.
ఐదేళ్ల పాలన కాలంలో దాదాపు 800 రోజులు కేవలం ఎన్నికల నిర్వహణకే ఖర్చయిపోతున్నాయి అన్నారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదని, మన దేశానికి ఉన్న సామర్థ్యం రీత్యా జమిలి ఎన్నికలు ఆచరణలో సాధ్యమేనని అన్నారు. ఈ తరహా ఎన్నికల వల్ల ప్రచార ఖర్చులు తగ్గుతాయని, పరిపాలనలో అవరోధాలు ఉండవని, పాలన క్రమబద్ధీకరణ జరుగుతుందని అన్నారు. తమిళనాట ఒకే దేశం.. ఒకే ఎన్నిక గురించి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇండియా కూటమి పక్షాలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు కరుణానిధి సమర్థించిన వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్నే నేడు ఆయన కుమారుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యతిరేకించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ అంశంపై స్టాలిన్ పునరాలోచన చేయాలని సూచించారు.
‘చెన్నైలోనే చాలా కాలం ఉన్నాను. తమిళనాడును వీడి మూడు దశాబ్దాలు గడచినా నన్ను ఈ గడ్డ వదలడం లేదు. నాపై ఈ తమిళ నేల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుక్కురళ్, మార్షల్ ఆర్ట్స్ తో పాటు సినిమా ప్రభావం నాపై ఎక్కువగా ఉండటానికి చెన్నైలో నివసించడమే. ఇది తిరువళ్లువర్ పుట్టిన భూమి, సిద్ధులు నడయాడిన నేల, మురుగన్ వెలసిన నేల, మహాకవి సుబ్రహ్మణ్య భారతియార్ పుట్టిన భూమి. వేలాది దేవాలయాలు కొలువైన పుణ్యభూమి. నాకు ఎంతో ఇష్టమైన ఎంజీఆర్ పెరిగిన, సేవలు అందించిన భూమి. వీరత్వానికి ప్రతీక అయిన జల్లికట్టుకు నెలవైన భూమి. ఈ భూమికి వీర వందనం చేస్తున్నాను. తమిళనాడు నాకు నేర్పిన పాఠాలు జీవితాంతం నాకు స్ఫూర్తిని కలిగిస్తాయి’’ అని అన్నారు.
ఒకే దేశం.. ఒకే ఎన్నిక కొత్తగా తెచ్చిన విధానం కాదు
ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే అంశం మీద తమిళనాడులో ఒక విధమైన అబద్ధపు ప్రచారం సాగుతోంది. ఒకప్పుడు దేశం మొత్తం ఒకే ఎన్నిక కావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిందిస్తున్నాయి. అలా సమయానుకూలంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే నేడు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ను వ్యతిరేకిస్తున్నారు. వీళ్ల వైఖరి చూస్తుంటే ‘అత్త పగలగొడితే పాత కుండ.. కోడలు పగలగొడితే కొత్త కుండ’ (అత్తై ఒడైచ్చా మన్ కుడం.. మరుమగళ్ ఒడైచ్చా పొన్ కుడం) అన్న సామెత గుర్తుకు వస్తోంది.
వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనేది కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కాదు. గతంలో కూడా భారత్లో ఈ విధానాన్ని అనుసరించాం. స్వతంత్రం వచ్చాక సుమారు రెండు దశాబ్దాలపాటు దేశం మొత్తం ఒకసారి ఎన్నికలు జరిగేవి.
ఎన్నికల వ్యయం విషయంలో కూడా గత ఎన్నికల్లో మనం అమెరికాని దాటేశాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలో.. జమిలి ఎన్నికల వల్ల దేశ జీడీపీ 1.5 శాతం మేర పెరిగే అవకాశం ఉందని సూచించింది. ఇది సుమారు రూ. 4.5 లక్షల కోట్లతో సమానం. జీడీపీ పెరిగితే అది ప్రతి సామాన్యుడి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఆ మొత్తం ద్వారా దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, విద్యా, వైద్యంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుందన్నారు.
ప్రతిపక్షాల వాదనలో పస లేదు
‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలకు జమిలి ఎన్నికలు నష్టం చేస్తాయని కొన్ని చెబుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తాయని అంటున్నాయి. నేను ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తిని. మాకు ఎప్పటి నుంచో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఒకేసారి ఎన్నికలు జరిగిన సందర్భాల్లో టీఆర్ఎస్, టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు పరాభవం తప్పలేదు. ప్రతిపక్షాల వాదనలో పస లేదనేది ప్రాంతీయ పార్టీల విజయంతో స్పష్టం అవుతోందన్నారు.
అవసరం అయితే తమిళనాడు ఎన్నికల్లోనూ ప్రచారం
తమిళ యువత ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలి. తరచు ఎన్నికలు జరగడం వల్ల అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. విజయ్ నాకు మంచి మిత్రుడు. పార్టీ అధినేతగా ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే. విజయ్ ఎవరినీ అనుసరించకపోవడం మంచిది. నటుడుగా రాణించడం వేరు. నటుడు రాజకీయాల్లోకి రాణించడం వేరు. కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం నా బాధ్యత. గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశాను. అవసరం అనుకుంటే తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తాను. మనది సనాతన ధర్మం పరిఢవిల్లిన భూమి. సనాతన ధర్మం అనే అంశాన్ని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రామాలయం లేని గ్రామం లేదు. తమిళనాట వినాయకుడి లేని ఊరుండదు‘ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్, జాతీయ కార్యదర్శులు అనిల్ ఆంటోని, అరవింద్ మేనన్, తమిళనాడు, కర్ణాటక కో ఇన్ ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు చక్రవర్తి, అర్జునమూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి, కరాటే త్యాగరాజన్, తమిళనాడు సీనియర్ రాజకీయ నాయకులు కెఎస్ రాధాకృష్ణన్ లు పాల్గొన్నారు.
Next Story