స్త్రీ శక్తితో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది
x

స్త్రీ శక్తితో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది

స్త్రీ శక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.


స్త్రీ శక్తితో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్‌ సక్సెస్‌ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందని ఆరా తీశారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా..? అని ముఖ్యమంత్రి అడిగారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు చెప్పారు.

గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని.. అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా.. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని... అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రికి వివరించారు. ఒకప్పుడు బాలికా విద్యను ప్రొత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం. ఇప్పుడు విద్యార్థినులు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం. దీని వల్ల బస్‌ పాసుల కోసం క్యూ లైన్లల్లో నిల్చొనే శ్రమ తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని అని సీఎం చెప్పారు.

ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు.. అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే.. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మరింత మేలు ప్రజలకు, మహిళలకు చేకూర్చగలమని చంద్రబాబు వివరించారు. స్త్రీ శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుకా... ముందు భాగాన బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8,458 స్త్రీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్లకోసం పోటీ పడితే.. ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య ఎంత మేరకు పెరిగిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు ప్రయాణిస్తే.. 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారని.. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు.
అలాగే స్త్రీ బస్సుల లైవ్‌ ట్రాకింగ్‌ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రెండు, మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్త్రీ శక్తి బస్సుల లైవ్‌ ట్రాకింగ్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపడతామని... ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి బస్సులకు లైవ్‌ ట్రాకింగ్‌ విధానాన్ని ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు. లైవ్‌ ట్రాకింగ్‌ విధానం అమల్లోకి వస్తే.. బస్సుల వేళలు తెలుసుకుని.. ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఫిక్స్‌ చేసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టిక్యులేటెడ్‌ ఈ–బస్సులపై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ తరహా బస్సులు ప్రస్తుతమున్న సాధారణ బస్సులకు.. మెట్రో రైలుకు మధ్య మిడిల్‌ లెవెల్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు.
Read More
Next Story