
సీనీ నటి జెత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు
ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ అంజనేయులు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ముంబాయి సినీ నటి కాందబరి జెత్తాని కేసులో మరో ఇద్దరి సీనియర్ ఐపీఎస్ అధికారులకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సీనియర్ ఐపీఎస్లు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మే 5న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
ఇదే కేసులో అరెస్టు అయిన డీజీపీ ర్యాంకు ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. తమ కస్టడీకి తీసుకున్న సీఐడీ పోలీసులు మూడు రోజుల పాటు ఆంజయనేయులును విచారించారు. అయితే పీఎస్ఆర్ అంజనేయులు సీఐడీ అధికారులకు ఇచ్చిన అంశాలకు, గతంలో కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు ఇచ్చిన వాంగ్మూలాలకు పొంతన లేదని భావిస్తున్న సీఐడీ అధికారులు మరో సారి కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు వారిద్దరి నోటీసులు జారీ చేశారు.
గతంలో కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలు వెల్లడించిన కొన్ని అంశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు ఖండించినట్లు సమాచారం. ముఖ్యంగా, జెత్వానీని ముంబై నుంచి తీసుకురావాలనే టాస్క్ను తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అప్పగించారని గతంలో విశాల్ గున్ని సీఐడీకి తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాను విశాల్ గున్నితో కేవలం నిఘా సంబంధిత విషయాలు మాత్రమే మాట్లాడి ఉంటానని.. జెత్వాని విషయంపై విశాల్ గున్నితో కానీ, కాంతి రాణాతో కానీ తాను ఎలాంటి చర్చలు జరపలేదని పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఇలా ముగ్గరు ఐపీఎస్ అధికారులు ఈ కేసులో ఇచ్చిన వాంగ్మూలాలు వేర్వేరుగా ఉండటం, పొంతన కుదరక పోవకపోవడంతో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు, అంశాలపై మరింత స్పష్టత రాబట్టడం కోసం కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలను మరోసారి ప్రశ్నించాలని సీఐడీ నిర్ణయించింది. అందులో భాగంగానే వారిద్దరికి మే 5న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. వీరి విచారణ అనంతరం కాదందబరి జెత్వానీ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
Next Story