కూలీలు కాదు..శ్రామికులు
x

కూలీలు కాదు..శ్రామికులు

తాను నగరాల్లో ఉంటున్నా.. పల్లెల్లో ఉండాలనేదే తన కోరికని పవన్‌ కల్యాణ పేర్కొన్నారు.


జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదం లేదని, కూలీ అనే పదాన్ని వాడకూడదని.. కూలీకి బుదులుగా గ్రామాల అభివృద్ధికి దోహదపడే శ్రామికులు అంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ అంశంపై పంచాయతీరాజ్‌ అధికారులు ఆలోచనలు చేయాలని, కూలీలుగా కాకుండా నరేగా శ్రామికులుగానే ఇక నుంచి అందరూ వారిని పిలవాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ శ్రామికులకు వంద రోజుల పని కల్పించామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు.

తాను ఇష్టపడే పంచాయతీ రాజ్‌ శాఖను తీసుకున్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. గ్రామ స్వరాజ్యం కోసం గాంధీ ఎప్పుడూ చెప్పే వారని, స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థలుగా గ్రామాలు ఏర్పడాలన్నారు. తాను నగరాల్లో ఉంటున్నా.. పల్లెల్లో ఉండాలనేదే తన కోరికని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి కోసం నగలు తాకట్టు పెట్టి కాంట్రాక్టర్లు పనులు చేశారని, నిధులు రాక జాప్యం కారణంగా వారికి సకాలంలో బిల్లులు చెల్లించలేక పోయామన్నారు. త్వరలోనే నిధులు వస్తాయని, రాగానే కాంట్రాక్టర్లందరికీ చెల్లించేస్తామన్నారు.
పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతం కోసం అనేక ఆలోచనలు, అధ్యాయనాలు చేశామన్నారు. అవినీతి, పైరవీలకు తావు లేకుండా, పారదర్శకంగా పంచాయతీరాజ్‌ శాఖలో బదీలలు చేపట్టామన్నారు. సమర్థవంతంగా పని చేసే అధికారులను వెతికి మరీ పట్టుకున్నానని, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వారిని కూడా గుర్తించి ప్రతిభ ఆధారంగా వారికి పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. వర్గాల పోరు, కులాల ఆధిపత్యం కోసం పోరు వంటి కొన్ని కారణాల వల్ల కొన్ని గ్రామాలు ఎంతో నష్టపోయాయని, అభివృద్ధికి దూరంగా ఉండి పోయాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయిలో కూటమికి సర్పంచ్‌లు లేకపోయినా.. పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలకు తగిన గౌరవం, ప్రాధాన్యతలు ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో నిధులు దారి మళ్లితే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 1120 కోట్లతో పంచాయతీల డెవలప్‌మెంట్‌కు వినియోగించినట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. గత తొమ్మిది నెలల కాలంలో రూ. 10,690 కోట్లు ఖర్చు చేసి డెవలప్‌ చేశామన్నారు. రూ. 1005 కోట్లతో గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేసినట్లు పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధించడంలో పంచాయతీరాజ్‌ శాఖ చాలా కీలకమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ వైశాల్యంలో నాలుగో వంతు ఉన్న దేశాలలో కలప ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, అందువల్ల ఏపీలోని గ్రామాల్లో కలప మొక్కలు పెంచాలని నిర్ణయించామని, కలపను పెంచి ఎగుమతి చేసే స్థాయికి ఏపీ చేరాలని అన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ ఆ దిశగా ఆలోచనలు చేయాలని, సహకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చాలా పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్‌ లేవని, దీంతో రైల్వే కోడూరు పరిధిలోని ఓ గ్రామంలో ప్లే గ్రౌండ్‌ కోసం స్థలం కొని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అనేక గ్రామాల్లో భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటిని ఎవరు స్వాధీనం చేసుకున్నారనే విషయాన్ని నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతుల కల్పన వంటి పలు అంశాల మీద పురోగతిని పవన్‌ కల్యాణ్‌కు అధికారులు వివరించారు. అంతకుముందు పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు.
Read More
Next Story