
ఆన్లైన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు ఆన్లైన్ ద్వారా దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఆ మేరకు ప్రత్యేకంగా తయారు చేసిన సాఫ్ట్వేర్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే అలా ఆన్లైన్లో నామినేషన్లు దాఖలు చేసినా, అందుకు సంబంధించిన పత్రాలను ప్రింట్లు తీసి వాటిపైన సంతకాలు చేసి నిర్థేశించిన గడువులోగా ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్న తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధునిక ఎస్–3 ఈవీఎంలను వినియోగించాలని ఆలోచనలు చేస్తున్నామని, ఈ యంత్రాల ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంతా సులువు అవుతుందని, డిటాచ్బుల్ మెమోరోఈ మాడ్యూల్ ద్వారా ఒకే యంత్రాన్ని రెండు, మూడు దశల్లో నిర్వహించే ఎన్నికలకు ఉపయోగించుకోవచ్చని, ఆ మేరకు తాము ఆలోచనలు చేస్తున్నట్లు నీలం సాహ్ని తెలిపారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు. 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి. నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.