ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతా
x

ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతా

మద్యం ఆదాయంలో 2 శాతం గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని, డ్రగ్స్‌ను కట్టడి చేసే విషయంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. యాంటీ నార్కోటిక్స్‌ డే సందర్భంగా గురువారం గుంటూరులో నిర్వహించిన వాకథాన్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, యువతే ప్రధాన లక్ష్యంగా గుంటూరు శ్రీకన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

గంజాయిని, డ్రగ్స్‌ను అరికట్టడంలో గత జగన్‌ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా గంజాయి బ్యాచ్‌లకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. అందరు కలిసి అడుగు ముందుకేసి గంజాయిని నిర్మూలనకు కృషి చేద్దామన్నారు.

తమ కూటమి ప్రభుత్వ హయాంలో ముఠా కక్షలకు వీల్లేదన్నారు. పెచ్చరిల్లిన రాయలసీమ ముఠాకక్షలను కర్కశంగా అణిచి వేసిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతామన్నారు, ముఠా కక్షలతో కాకుండా, తప్పుడు పనులతో రాజకీయ లబ్దికోసం కాకుండా ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకోవాలని పరోక్షంగా వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌కు సూచించారు. 2021లో విశాఖ కేంద్రంగా విచ్చల విడిగా దేశం మొత్తంలో 50 శాతం సాగు చేయడం బాధ కలిగించిందన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, డ్రగ్స్‌ నివారణకు ఈగల్‌ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్కోటిక్స్‌ సెల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. మూడు చోట్ల 56 డీఅడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మద్యంలో వచ్చే ఆదాయాంలో రెండు శాతాన్ని గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ఖర్చు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారానికి సినినటులు కూడా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు.
Read More
Next Story