
ఈ ఆలయాల్లో కూడా నిత్య అన్నప్రసాదం
టేస్టులోను, క్వాలిటీలోను ఏమాత్రం రాజీపడకుండా భక్తులకు అందించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని మరి కొన్ని ప్రధాన ఆలయాల్లో నిత్యం అన్నప్రసాదం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 15 ఆలయాల్లో అమలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. త్వరలో వీటిల్లో నిత్య అన్నప్రసాదం అమలు చేయనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, కాకినాడ జిల్లాలోని తుని వద్ద లోవలో కొలువైన తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో వెలసిన వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంజిప్రోలులో కొలువైన తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి దేవస్థానం, గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవాలయంలో నిత్య అన్నప్రసాదం అమలు చేయాలని నిర్ణయించారు.
వీటితో పాటుగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఇదే జిల్లా కందుకూరు ప్రాంతంలో ఉన్న శ్రీ మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, కర్నూలు జిల్లా ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయం, నంద్యాల జిల్లాలోని మహానందీశ్వరస్వామి దేవాలయం, అదే జిల్లాలోని రంగాపురం మద్దలేటి రసింహాస్వామి దేవస్థానం, అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి భాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ వారి ఆలయాల్లో అన్నప్రసాదం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, శ్రీకాళహిస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకాతిరుమల, అన్నవరంతో పాటు ఇటీవల ప్రమాదం చోటు చేసుకున్న సింహాచలనం అప్పన్న స్వామి దేవాలయాల్లో నిత్య అన్నప్రసాదం అమలు చేస్తున్నారు. తక్కిన వాటిల్లో కొంత మేరకే దీనిని అమలు చేస్తున్నారు. ఇక ముందు తక్కిన ప్రధాన ఆలయాల్లో కూడా అందరికీ అన్నప్రసాదం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం మాదిరగా అన్నప్రసాదంలో ప్రమాణాలు పాటించడంతో పాటుగా టేస్టులోను, క్వాలిటీలోను, నీట్నెస్లోను ఏమాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
Next Story