ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా ఒద్దికగా అడుగులు వేస్తోంది. 2014–19 కాలంలో కూటమి కలయిక మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయినా.. ఈ సారి మాత్రం కూటమి బలం చాలా దృఢంగానే కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల నుంచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపుల వరకు ఎలాంటి అలకలు, ఆధిపత్య దోరణులు లేకుండానే సమస్యలను పరిష్కిరించుకోగలిగారు. తర్వాత వచ్చిన రాజ్య స్థానాల విషయంలో కూడా కలిసే చర్చించుకున్నారు.. కలిసి కట్టుగానే పంచుకున్నారు.
నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులుగా ఉన్న బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో టీడీపీ నుంచి బీదా మస్తాన్రావుకు తిరిగి రాజ్య సభ స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు మరో స్థానాన్ని సానా సతీష్బాబుకు కేటాయించారు. ఇక బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్య సభ స్థానానికి తిరిగి ఎంపిక చేశారు. అలా టీడీపీకి రెండు, బీజేపీకి ఒకటి చొప్పున రాజ్య సభ స్థానాలను కలిసి పంచుకున్నారు. అయితే ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం జనసేకు కేటాయిస్తారని, తద్వారా నాగబాబును రాజ్య సభకు పంపుతారనే టాక్ వినిపించింది. అయితే అది కార్యరూపం దాల్చ లేదు.
తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు తెరపైకి వచ్చాయి. ఐదు స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీటిని ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి వర్గాల్లో వాడీ వేడిగా చర్చలు జరిగాయి. కూటమిలో టీడీపీకే అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఈ ఐదు స్థానాలు తామే తీసుకోవాలని టీడీపీ పెద్దలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు తొలుత భావించారు. అయితే తన సోదరుడు నాగబాబుకు ఒక స్థానం కేటాయించాలని పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో ఈక్వేషన్స్ మారాయి. జనసేనకు ఒక స్థానం కేటాయించడంతో నాగబాబు గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
తక్కి నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థులకే కేటాయించుకోవాలని టీడీపీ పెద్దలు భావించారు. అయితే ఈ సారి బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. ఇది కాస్త ఢిల్లీ వరకు చేరింది. ఢిల్లీ బీజేపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్తో ఒక స్థానాన్ని బీజేకీ ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో టీడీపీకి ఐదు స్థానాలకు బదులు మూడు స్థానాలకే పరిమితం కాగా, బీజేపీకి ఒకటి, జనసేనకు ఒకటి చొప్పున సీట్లను పంచుకున్నారు. జనసేనలో అభ్యర్థి ఎంపిక సమస్యలు లేక పోయినా, కేడర్లో మాత్రం అసంతృప్తులు ఉన్నట్లు జనసేన శ్రేణుల్లో చర్చ ఉంది. అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆచితూడి అడుగులేశారు.
ఆశావాహుల జాబితా పెద్దదిగా ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ సూచనల మేరకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక బీజేపీలో కూడా తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజులు పోటీ పడ్డారు. చివరకు సోము వీర్రాజును ఖరారు చేశారు. సోమవారం నామినేషన్కు తుది తేదీ కావడంతో ఈ నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పదవులను కలిసి పంచుకుంటున్నట్లు కూటమి వర్గాలు పైకి మాట్లాడుకుంటున్నా.. టీడీపీ శ్రేణుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తులు వ్యక్తం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమకు అత్యధిక సీట్లున్నా, రాష్ట్రంలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ కీలక అవకాశాలను కూటమి మూలంగా కోల్పోవలసి వస్తోందనే అసంతృప్తులు టీడీపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది.