
మోదీ అంటే విక్టరీ: లోకేష్
25 ఏళ్లుగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న నరేంద్ర మోదీని జాతి ఎప్పటికీ మరువదని లోకేష్ అన్నారు.
నమో అంటే మన నరేంద్రమోదీ. మోదీ అంటే విక్టరీ .. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారన్నారు.
‘‘గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో ఇప్పుడూ అలాగే కష్టపడుతున్నారు. గుజరాత్ను శక్తిమంతమైన రాష్ట్రంగా మార్చారు. కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. నమో సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. విశాఖ రైల్వే జోన్ను ఏర్పాటు చేసుకున్నాం. నమో అంటే దేశ ప్రజల నమ్మకం.. దేశ ప్రజలకు నమో అంటే నమ్మకం’’ అని లోకేశ్ అన్నారు.
అంతకుముందు.. ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని ఆశీస్సులతో ఏపీలో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టిందన్నారు. 2024లో ప్రజలు వేసిన ఓటు.. రూ. వేల కోట్ల సంక్షేమ అభివృద్ధి పనులను అందించిందని అన్నారు. తల్లికి వందనం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ వంటి ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. భవిష్యత్ తరాల కోసం కూటమిగా ఏర్పడి.. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని గాడిన పెట్టారని పేర్కొన్నారు.