తుపాకుల, డ్రోన్ల కాపలా  మధ్య నంబాల కేశవ రావు పెద్ద కర్మ
x

తుపాకుల, డ్రోన్ల కాపలా మధ్య నంబాల కేశవ రావు పెద్ద కర్మ

ఊర్లో నిఘా, ఊరి బయట నిఘా, గాలిలో డ్రోన్ ల నిఘా. మిత్రులెవరు రాకుండా ‘విజయవంతం’ గా అడ్డుకున్న కేంద్రం


-పి ప్రసాద్


ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ఈ క్రింది అపజయాలను మూట కట్టుకుందనే విమర్శ వుంటే ఉండనివ్వండి.

*భారతీయులకి బేడీలు వేసి పశువుల్లా అమెరికా సైనిక విమానాల్లో తెచ్చిన ట్రంప్ సర్కార్ చర్యను మోదీ ఖండించలేదనే విమర్శ వుంటే ఉండొచ్చు.

*అమెరికా పర్యటనలో ట్రంప్ ఎదుట మోదీ డూడూ అన్నాడనే విమర్శ వుంటే ఉండొచ్చు.

*సుంకాల యుద్ధంలో ట్రంప్ తో బేరమాడే శక్తిలేని దుర్భలుడనే విమర్శ మోదీపై వుంటే ఉండనివ్వండి.

*ఫహల్గామ్ "టెర్రరిస్టుల" దాడిని నివారించలేని అసమర్ధ సర్కార్ అంటూ మోదీని ఆడిపోసుకునే విమర్శ వుంటే ఉండొచ్చు.

*ఆ దాడి తర్వాత నలభై రోజులైనా ఆ నలుగురు టెర్రరిస్టుల్ని పట్టుకోలేని దుర్భలుడనే విమర్శ వుంటే ఉండనివ్వండి.

*పడగ విప్పి బుసకొట్టే కోడె త్రాచుపాములా ఆపరేషన్ సిందూర్ ని ప్రారంభించి, పారిపోయరా అన్నట్లు ముగించిన మోదీ అసమర్ధత గూర్చి విమర్శ వుంటే ఉండొచ్చు.

*పాక్ ఇండియా మధ్య తానే మధ్యవర్తిత్వం వహించాననీ, వాణిజ్య బెదిరింపుతో ఆ రెండు సర్కార్లపై వత్తిడి తెచ్చి ఒప్పందం సాధించానని ట్రంప్ ప్రకటన చేస్తుంటే మోదీ ఖండించలేని చేతగానితనం గూర్చి విమర్శ వుంటే ఉండొచ్చు.

*వాస్తవిక సరిహద్దు యుద్ధం జరక్కుండానే, ఒక్క రాత్రి క్రాస్ బోర్డర్ ఎయిర్ దాడుల్లోనే ఐదు యుద్ధ విమానాలను కోల్పోయిన పరాభావ భారాన్ని మోదీ మోస్తే మోయనివ్వండి.

*31-3-2026 లోపు మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యాన్ని మోదీ సర్కార్ సాధించలేకపోతే పోనివ్వండి.

*ఒక్క కర్రెగుట్టను వేలాది సాయుధ సైనిక బలగాలు ముట్టడించి సాధించిన విజయాలు ఏంటయ్యా అనే విమర్శలు మోదీ పై వుంటే ఉండొచ్చు.

పై పది అపజయాలే కాకుండా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి, ఆర్ధిక అసమానతలు, సాంఘిక వివక్షతలు, ఎన్నికల హామీల అమలు వంటి ఇంకా ఎన్నెన్నో అపజయాల్ని కూడా మోదీ సర్కార్ మూట కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఈ అన్ని అపజయాలను మరిచిపోయే విధంగా మరో గొప్ప ఘనమైన తాజా విజయం మోదీ సర్కార్ సాధించింది. అదేమిటో తెల్సుకుందాం.

అనగానగా ఒక చిన్న పల్లెటూరు వుంది. దక్షిణ భారతదేశంలో, ఏపీ అనే రాష్ట్రంలో, ఉత్తరాంద్రలో శ్రీకాకుళం జిల్లాలో అదొక కుగ్రామం! పేరు జియన్న పేట! ఛత్తిస్ ఘడ్, ఏపీ రెండు రాష్ట్ర సర్కార్ల సహకారంతో ఆ వూరికి మావోయిస్టు పార్టీ నేత నంబాళ్ల కేశవరావు మృతదేహం కాదు కదా, కనీసం అస్తికలు బూడిద కూడా రానివ్వ కుండా చేయడంలో మోదీ సర్కార్ అతి పెద్ద విజయాన్ని సాధించింది. ఆ విజయ పరంపర అక్కడే ఆగిందా? లేదు. ఇంకా వున్నాయి.

హిందూ మతాచారం ప్రకారం ఆ కుటుంబం నిన్న జరిపిన పెద్దకర్మకు వారి రక్త సంబంధీకుల్ని ఆధార్ కార్డు ద్వారా పలు అంచెల తనిఖీలు చేపట్టి, వారిని తప్ప మరెవ్వరినీ రానివ్వకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అండతో మోదీ సర్కార్ మరో అతిపెద్ద విజయాన్ని సాధించింది.

ఫహల్గామ్ లోకి పాక్ "ఉగ్రవాదుల్ని" రాకుండా ఆపలేకపోవచ్చు. కానీ జియన్న పేటకు పొరుగు గ్రామాల జనం రాకుండా ఆపగలిగింది. ఇలాంటి సందర్భాల్లో ఆహ్వానించే 'బంధుమిత్రులు' అనే జంటలో 'బంధు' శ్రేణికి తప్ప 'మిత్ర' శ్రేణికి సైతం ఆహ్వానం పంపకుండా ఆ కుటుంబ సభ్యుల మీద వత్తిడి తెచ్చి మరో ఘన విజయం సాధించింది. ప్రెస్ (మీడియా) కి కూడా ఆహ్వానాలు పంపకుండా చేయగలిగింది. విజయ పరంపర ఆగిందా? లేదు.

ఆ వూరును ఫహల్గామ్ కంటే మించిన ఓ గొప్ప ఇంటర్నేషనల్ హాట్ స్పాట్ గా మార్చడం సాధారణ విజయమా? ఆ వూరు నిండా పోలీస్ బలగాలే! రాష్ట్ర, కేంద్ర ఇంటిలిజన్స్ వర్గాలే! సీసీ కెమెరాలే! హైవే నుండి ఆ ఊరికి వచ్చే స్పాట్ లో ఓ బారికేడ్! ఊరి ముందు మరో బారికేడ్! అక్కడల్లా సీసీ కెమెరాలే! పెగాసిస్ నెట్ వర్క్! "పాకిస్తాన్" నుండి ఫహల్గామ్ వచ్చే దారిలో నిఘా విధించే విధి నిర్వహణలో ఓటమి పొందితే పొందవచ్చు. కానీ అదో గుణపాఠం తీసుకొని పొరుగూర్ల నుండి పెద్దకర్మకు ఒక్క పురుగు కూడా రాకుండా మోదీ సర్కార్ ఎంతటి వ్యూహత్మక విజయం సాధించిందో దేశ ప్రజలు గుర్తించి పెద్దగా చప్పట్లు కొట్టొద్దా?

బైనాక్యూలర్స్ తో ఆ చిన్న వూరులో నాలుగు మూలలల్లో డాబాల పై ఎక్కిన పోలీస్ నిఘా బృందాలు ఊరిచుట్టూ పొలాల నుండి ఎవరైనా చొరబాటుదార్లు వూళ్ళో చొరబడతారేమోనని ఎంత పటిష్టంగా కాపలా కాశారో ఈ దేశ ప్రజలకు తెలుసా? పాకిస్తాన్ నుండి చొరబాటుదార్లు రాకుండా ఆపలేకపోతే పోనివ్వండి. కానీ ఆ చిన్న వూరు జియన్న పేటకు ఆ పక్క గ్రామాల నుండి రాకుండా ఆపగలిగింది. ఆ ఘన విజయాన్ని గుర్తించి దేశ ప్రజలు చప్పట్లు కొట్టొద్దా?

పొలాల్లో పనులకు వెళ్లిన ఆ ఊరి రైతులు, కూలీల మీద కూడా నిఘా! పైగా డ్రోన్స్ టెక్నాలజీ కూడా! ఏమైనా, నిన్న వూళ్ళోకి బయటి నుండి పురుగు రానివ్వకుండా ఆపడం ఆషామాషీ వ్యవహారం కాదు. అదో "చరిత్రాత్మక" విజయమే. ఫహల్గామ్ అపజయాల మాటను మరిచిపోయి దేశ ప్రజలు ఇన్ని గొప్ప విజయాలు సాధించిన మోదీ సర్కార్ కి చప్పట్లు కొట్టొద్దా?

పొరుగు దేశం పాకిస్తాన్ నుండి సరిహద్దు దాటాక 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫహల్గామ్ వచ్చిన "ఉగ్రవాదుల్ని" రానివ్వకుండా ఆపడంలో మోదీ సర్కార్ వైఫల్యం చెందితే చెంది ఉండొచ్చు. కానీ జియన్న పేట పక్కన కేవలం కిలోమీటరులోని పొరుగూరి ఎరిగిన జనం నుండి ఒక్క పురుగును రానివ్వకుండా ఆపడం నభూతో నభవిష్యత్తు కదా! కొడదాం చప్పట్లు!


(పి ప్రసాద్, ట్రేడ్ యూనియన్ లీడర్, రాజకీయ వ్యాఖ్యాత, ఆంధ్రప్రదేశ్)


Read More
Next Story