
బతికుంటే వంగవీటి రంగా ముఖ్యమంత్రి అయ్యేవారా?
ప్రజారాజ్యం, జనసేన పుట్టేవే కావా? నాగబాబు వ్యాఖ్యలను కాపు కోణంలో చూడాల్సిందేనా..?
జనసేన నేత,ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా వంగవీటి మోహన్ రంగా ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి..వంగవీటి రంగా సమర్ధత, బలమైన సామాజిక వర్గం నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఇలాంటి మాటలు అని ఉండోచ్చేమో గాని , రంగా బతికివుంటే ప్రజారాజ్యం,జనసేన పార్టీల అవసరమే వుండేది కాదని చెప్పడంలోనే ఏదైనా అంతరార్ధం వుందా అన్న అనుమానం కలుగుతోంది.రంగాని ప్రజలకు దగ్గరగా వుండే వ్యక్తని ,సమర్ధుడని చెప్పిన నాగబాబు అలాంటి వారు లేకపోవడం వల్లే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు.
ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలతో ఏపీలో కాపు సామాజిక వర్గం నేతలు రంగా అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.మిగిలిన రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.జనసేనకు అండగా వున్న కాపు సామాజిక వర్గాన్ని మరింత ఆకర్షించేందుకే నాగబాబు రాజకీయ వ్యూహం ప్రకారమే ముందుకు సాగారని కొందరు విశ్లేషిస్తున్నారు.
వంగవీటి రంగా కాపు నేతగా ఎదిగారు ఒకదశలో ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పారు.ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన రంగా ప్రాధాన్యతను మరింత పెంచుతూ నాగబాబు మాట్లాడటం,ఆయన బతికుంటే ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పిన నాగబాబు ఇప్పుడు కాపు నేతలకు ఆ అవకాశం వుందని మాత్రం చెప్పలేదు. రంగా రాజకీయ ప్రవేశం, దేవినేని కుటుంబంతో విభేదాలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను గుర్తు చేశారు. రంగా కుమారుడు రాధాకృష్ణ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రస్తావించారు.
కాపు నేతలుగానే చిరు,పవన్ పార్టీలు పెట్టారా?
వంగవీటి రంగా చనిపోవడం అలాంటివారు లేకపోవడం వల్లే అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం, ఇప్పటి పవన్ జనసేన వచ్చాయని చెప్పడం ద్వారా కాపు కులానికి పెద్ద నాయకులుగానే వీరిద్దరూ రాజకీయాలలోకి వచ్చినట్లు అనుకోవాల్సి వస్తోంది. ఇంతమటుకూ కేవలం కాపుల కోసమే జనసేన పుట్టిందని ఎక్కడా చెప్పలేదు. అప్పట్లో ప్రజారాజ్యం విషయం లోనూ అదే జరిగింది.కాని నాగబాబు మాటలలో కాపులను మరింతగా దగ్గరచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రజారాజ్యం-
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, అది 'సామాజిక న్యాయం' అనే నినాదంతో ముందుకు వచ్చింది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తామని ప్రకటించినప్పటికీ, చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ఆ వర్గం నుంచి అపారమైన మద్దతు లభించింది. కాపుల ఓట్లు పార్టీకి బలంగా మారాయి. అయితే, ప్రజారాజ్యం కేవలం కాపు పార్టీ అని చెప్పడం కూడా సరైంది కాదు. అది ఒక రాష్ట్ర స్థాయి పార్టీగానే ఆవిర్భవించింది. అనేక వర్గాల మద్దతు కోరింది.
జనసేన-
పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించిన జనసేన పార్టీ కూడా 'ప్రజల సమస్యలు', 'మారుతున్న సమాజం' వంటి అంశాలపై దృష్టి సారించింది. యువత, వివిధ వర్గాల ప్రజల మద్దతును ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, ఆ వర్గం నుంచి జనసేనకు సహజంగానే బలమైన మద్దతు లభిస్తోంది. కానీ పార్టీ మ్యానిఫెస్టో, సిద్ధాంతాలు ఏ ఒక్క కులానికో పరిమితం కాలేదు.ప్రస్తుతం జనసేన ,తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అధికారం పంచుకోవడంతో సహజంగానే కాపు సామాజిక వర్గం ఇన్నాళ్లకు తమకు అధికారంలో భాగం దక్కిందని సంబరపడుతున్నారు. అయితే తమ నేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న బలమైన కోర్కె కూడా ఆ వర్గంలో కనిపిస్తోంది.
వంగవీటి రంగాకు ప్రజల్లో ఆదరణ
వంగవీటి మోహన రంగా 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తి. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా ఆయన బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. కాపు సామాజిక వర్గంలో ఆయనకు తిరుగులేని ఆదరణ ఉండేది. పేదలు, బలహీన వర్గాల కోసం పోరాడే నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన చేపట్టిన ఉద్యమాలు, ప్రజల పక్షాన నిలబడటం వంటివి ఆయనకు అశేష జన మద్దతును కూడగట్టాయి. శాసనసభ్యుడిగా కూడా ఆయన ప్రజల సమస్యలపై గట్టిగా గళం విప్పారు.అయినా కాపు సామాజిక వర్గానికి బలమైన నేతగానే ముద్రపడ్డారు. రంగాకు ప్రజల్లో ఉన్న ఆదరణ అనూహ్యమైనది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకు పూర్తి మద్దతు ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి, బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకునే సామర్థ్యం ఆయనకు ఉండేది.నాగబాబు వ్యాఖ్యానించినట్లుగా రంగా సపరేటుగా పార్టీ పెట్టి వుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో ..అదంతా ఊహాజనికమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.రంగా చనిపోయే నాటికి, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీఆర్ నాయకత్వంలో బలమైన స్థానంలో ఉండి. ఈ నేపథ్యంలో రంగా ముఖ్యమంత్రి కావాలంటే ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి ప్రయత్నించే ఏ నాయకుడికైనా అప్పటి రాజకీయాల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేది. రంగా రాజకీయ నేపథ్యం, సామాజిక సమీకరణలు ముఖ్యమంత్రి పదవికి ఒక ప్లస్ పాయింట్ అయ్యేవి. అయితే, ఆర్థికంగా, రాజకీయంగా బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడం అవసరం.
నాగబాబు వ్యాఖ్యలు రంగా పట్ల ఉన్న అభిమానాన్ని, ఆయన నాయకత్వ లక్షణాలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ఏదిఏమైనా వంగవీటి రంగా మరణం తెలుగు రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది, ఆయన బతికి ఉంటే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం భిన్నంగా ఉండేదేమో అన్న చర్చకు ఎప్పుడూ తెరపడదు.
Next Story