
మెగా డ్రీమ్స్ ఉండాలి–సంకల్పం ఉండాలి–అప్పుడు అన్నీ సాధ్యమే
రాజకీయాలు ముఖ్యమే కానీ... సమాజం గురించి కూడా ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మెగా డ్రీమ్స్ ఉండాలి... సంకల్పం ఉండాలి... అప్పుడు సాధ్యమే అని సీఎం చంద్రబాబు అన్నారు. 2028–29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ. 5,42,985 సాధిస్తామన్నారు. 2029–2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000 సాధించగలమని విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఇదేమీ అసాధ్యం కాదు... నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. విజన్ 2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్పై ఇంకా అనుమానాలు సరికాదు అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి సీకే కన్వన్షెన్ సెంటర్లో శుక్రవారం జరిగిన వే టు న్యూస్ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజన్ రూపకల్పన చేయడమే కాదు... దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలి. ఆ దిశగానే తము పని చేస్తున్నట్లు సీఎం చెప్పారు. జాతీయ స్థాయిలో వికసిత్ భారత్–2047, రాష్ట్రస్థాయిలో స్వర్ణాంధ్ర–2047 విజన్ సిద్ధం చేశామన్నారు. 20–25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారత దేశం అభివృద్ధి అన్ స్టాపబుల్గా మారింది. 2038 నాటికి భారత దేశం నెంబర్–1 అవుతుంది... ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రణాళికలు రూపొందిచుకున్నాం. ఈ ఏడాది.. గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగాం. 2028–29 నాటికి రూ. 29, 29,402 కోట్ల మేర జీఎస్డీపీ, 2029–2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించామని, దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజకీయాలు ముఖ్యమే కానీ... సమాజం గురించి కూడా ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు.. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 1999లో గెలిచాను. 1999లో ప్రభుత్వం వచ్చాక ఓ తపనతో పని చేశాను.. కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు పూర్తి బ్యాలెన్స్ చేస్తున్నాం... సంపద çసృష్టిస్తున్నారం.. దానిని పేదలకు అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
నాలుగోసారి కూడా మోదీనే వస్తారు. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ప్రపంచంలో వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయి. సుస్థిరతకు, నాయకత్వానికి మారు పేరు భారతదేశమే. దేశంలో సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రిని నేనే. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపై ఫోకస్ పెట్టాను. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజేస్ కారణంగా ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి వంటి నగరాల అభివృద్ధిపై ఫోకస్ పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పని రాబోయే మూడేళ్లల్లో పూర్తి అవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన ఇన్ఫ్రా అందుబాటులోకి వస్తుంది. పూర్తి అయిన ఆ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తారు.
2019లో గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తి అయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది. మళ్లీ అధికారం చేపట్టాక... పోలవరంపై ఫోకస్ పెట్టాం.. కేంద్రం కూడా నిధులు ఇచ్చింది. 2027 సెప్టెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ–నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం. ప్రజల్లో రకరకాల వాళ్లు ఉంటారు... అందరూ అన్ని అందిపుచ్చుకోలేరు... అందుకే రకరకాల పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం. ఆ పాలసీలు తీసుకునేటప్పుడు పబ్లిక్ సెంట్రిక్ గా తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు,
Next Story