
కనికరం లేకుండా కూల్చేశారు
బాధితులకు న్యాయం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు.
దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా విజయవాడ భవానిపురంలో 42 ఇండ్లను కనికరం లేకుండా కూల్చడం దారుణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మండిపడ్డారు. అన్యాయంగా కూల్చడమనేది కూటమి ప్రభుత్వ తొందరపాటు చర్య అని ధ్వజమెత్తారు. సుమారు 25 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న స్థానికులకు నిలువ నీడ లేకుండా చేశారు. ఉన్న పళంగా కట్టుబట్టలతో రోడ్డున పడేశారు. వారి ఆవేదన వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఎన్నికల్లో సమస్యను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేశారని ధ్వజమెత్తారు.
చివరికి సమస్య చెప్పుకునేందుకు వెళ్తే సీఎం చంద్రబాబు సైతం బాధితులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాం. భవానిపురంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పిలిచి మాట్లాడండి. వారి వేదన వినండి. వారికి న్యాయం చేయండి. వివాదానికి పరిష్కారం చూపండి. అని వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు.
Next Story

