
ఏపీలో 16 లక్షల మందికి వైద్య పరీక్షలు
ఆగస్టు 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ వెల్లడించారు.
ఈ నెల 17 నుంచి ప్రారంభమైన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు సుమారు 16 లక్షల మంది మహిళలు, బాలబాలికలు, చిన్నారులకు పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 8,050 వైద్య శిబిరాల ద్వారా 8 రకాల పరీక్షలను ఉచితంగా చేశామన్నారు. మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఇతర స్క్రీనింగ్ పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా 34,460 మందికి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(పిఎంజెఎవై) హెల్త్ కార్డుల్ని జారీ చేశామన్నారు. వచ్చే నెల 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఉప ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనాసుపాత్రుల్లో కూడా ఏర్పాటు చేశామన్నారు. స్పెషలిస్టు వైద్యుల ద్వారా మహిళలకు ఆరోగ్య పరీక్షలు జరుగుతున్నట్లు వీరపాండియన్ తెలిపారు. ఈ శిబిరాల ద్వారా మహిళలు, చిన్నారులు, బాలబాలికలకు కలిపి కోటి మందికి పైగా ఆరోగ్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.