పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు
x

పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు

కుప్పంలో పైలట్ గా అమలు చేస్తున్న డిజినెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా... పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్శల్ హెల్త్ స్కీంపై అధికారులతో చర్చించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా నాలుగు దశలు దాటామని..వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయని సీఎం అన్నారు. ప్రజలకు, విద్యార్ధులకు అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించాం. ఈ 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి. మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్ నెస్ సెంటర్, యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాలి. ఆస్పత్రుల్లో 70 శాతం మేర పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నాం. అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ మోడళ్లల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఉన్నాయి. వాటిని ఆధ్యయనం చేయండి. రోగుల మెరుగైన, నాణ్యమైన సేవలు సులభంగా అందాలి. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్న ఆస్పత్రులకు రేటింగ్ ఇవ్వాలి. నీతి ఆయోగ్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రమాణాలు, నిబంధనలు ఉండాలి”. అని సీఎం చంద్రబాబు పేర్కోన్నారు.
దేశానికే దిక్సూచి సంజీవని ప్రాజెక్టు
కుప్పంలో పైలట్ గా అమలు చేస్తున్న డిజినెర్వ్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిగా ఈ ప్రాజెక్టు నిలిచే అవకాశం ఉంటుందని అన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డులను ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని అన్నారు. ప్రస్తుతం కుప్పంలో పైలట్ గా చేస్తున్న సంజీవని ద్వారా 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని సూచించారు. కుప్పంలో రిజిస్టర్ అయిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్ ను సిద్ధం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి డిజిట్ హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని తెలిపారు. 49 వేల మంది రోగులకు సంబంధించిన డేటాను సేకరించామని అధికారులు తెలిపారు. బ్లడ్ ప్రొఫైల్, అనీమియా, కార్డియాక్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, డయాబెటీస్ లాంటి వాటిని గుర్తించి డేటా రూపొందించామని వివరించారు. 2026 జనవరి 1 తేదీ నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. సంజీవిని ప్రాజెక్టు సమర్థంగా అమలుచేస్తే వైద్యారోగ్యంలో ప్రభుత్వం చేసే వ్యయం గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. టాటా- బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కావాలని సీఎం ఆకాంక్షించారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రత్యేకంగా నేచురోపతి ఆస్పత్రితో పాటు యోగా కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యురేటివ్ విధానం
రాష్ట్రప్రభుత్వం అమలు చేయనున్న యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్సు విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్ లు ఆస్పత్రుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు వస్తున్నాయని తద్వారా ఒక నెలకు రూ.330 కోట్ల వ్యయం చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో .. ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని సిఎం సూచించారు. ప్రత్యేకించి ప్రజారోగ్యంలో ప్రివెంటివ్ , క్యురేటివ్ విధానం ద్వారా వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతో పాటు ప్రజల వ్యక్తిగత వ్యయం కూడా తగ్గేలా చూడాలని స్పష్టం చేశారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించేందుకు ఓ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. సమీక్ష లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సౌరబ్ గౌర్, వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story