
ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు
విజయవాడ, విశాఖపట్నం నగరాలకు డిప్యూటీ పోలీసు కమిషనర్ లను ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పెద్ద మార్పులు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్రంలోని కీలక విభాగాలు, జిల్లాలు, ముఖ్యమైన సిటీలకు కొత్త పోలీసు అధికారులను నియమించారు.
విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్ (డీసీ) గా మణికంఠ చందోలు నియమితులయ్యారు. అలాగే విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పాటిల్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో రెండు ప్రధాన సిటీల్లో భద్రతా వ్యవస్థలు మరింత బలోపేతం కావడం ఖాయమని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడ సిటీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్గా షేక్ షరీన్ బేగం, మహిళల భద్రత విభాగం సీఐడీ ఎస్పీగా వి.రత్నలు బదిలీ అయ్యారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో కూడా ముఖ్య మార్పులు జరిగాయి. సైబర్ క్రైమ్, సీఐడీ ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె. శ్రీనివాసరావు, ఏఎసీబీ జాయింట్ డైరెక్టర్గా జి అశోక్ కుమార్ నియమితులయ్యారు.
సీఐడీ ఎస్పీగా ఆర్.గంగాధర్ రావు, ఈగల్ ఎస్పీగా కేఎమ్ మహేశ్వర రాజు, ఎన్టీఆర్ కమిషనరేట్లో సైబర్ క్రైమ్స్ కమిషనర్గా కృష్ణ ప్రసన్నలు కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకాలు సైబర్ దాడులు, ఇంటెలిజెన్స్ సమాచార సేకరణ, కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా స్థాయిలో కూడా బదిలీలు ఎక్కువగా జరిగాయి. విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్గా రవిశంకర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, శ్రీసత్యసాయి జిల్లా అదనపు ఎస్పీగా సురన అంకిత మహావీర్, జంగారెడ్డి గూడెం ఏఎస్పీగా ఆర్ సుస్మిత, చింతూరు ఏఎస్పీగా హేమంత్ బొడ్డు, పార్వతీపురం ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియమితులయ్యారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో రూరల్ డిప్యూటీ కమిషనర్గా బి.లక్ష్మీనారాయణ, డీజీపీ కార్యాలయంలో ట్రైనింగ్ అసిస్టెంట్ ఐజీగా ఎం.సత్తిబాబు, ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్ ఐజీగా టి.పనసారెడ్డి, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అసిస్టెంట్ ఐజీగా పి.వెంకటరత్నం లను ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

