మావోయిస్టులు లొంగిపోవడానికి కాదు, తల దాచుకోవడానికే?
x
విజయవాడలో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశం

మావోయిస్టులు లొంగిపోవడానికి కాదు, తల దాచుకోవడానికే?

విజయవాడ న్యూ ఆటోనగర్ లో పట్టుబడ్డ మావోయిస్టులు లొంగిపోవడానికి వచ్చారా? తలదాచుకునేందుకు వచ్చారా? ఏది నిజం?


ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులపై పోలీసుల ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. మారేడుమిల్లి వద్ద జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ప్రముఖ నేతలు మధ్వి హిడ్మా, టెక్ శంకర్‌తో పాటు 13 మంది మావోయిస్టులు మరణించారు. దీని పర్యావసానం దాదాపు ఒకే రోజులో విజయవాడ న్యూ ఆటోనగర్‌లో 27 మంది (21 మంది మహిళలు, 6 మంది పురుషులు) పట్టుబడ్డారు. ఒకే సారి ఇంత మంది నగరంలో పట్టుబడటం చరిత్రలో మొదటిసారి. కానీ వీరు లొంగిపోవాలని వచ్చారా? అనుచరుల సమాచారంతో పోలీసులు 'బోనస్'గా పట్టుకున్నారా? ఈ ప్రచారాల్లో నిజమెంత?

విజయవాడ ఆటోనగర్ ఆపరేషన్

విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు కార్మికుల ముసుగులో ఉండటాన్ని గమనించారు. అక్టోపస్ (ఆంధ్రా పోలీసుల ప్రత్యేక దళం) కమాండోలు, కృష్ణా జిల్లా పోలీసులు సోమవారం రాత్రి రైడ్‌లో వీరిని పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ (నవంబర్ 18) తర్వాత జరిగింది. మొత్తంగా ఆంధ్రలో 50 మంది మావోయిస్టులు (కృష్ణా, ఏలూరు, ఎన్‌టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో) పట్టుబడ్డారు. ఆయుధాలు, సర్కారు సరఫరా పత్రాలు, మావోయిస్టు ప్రచార సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు అధికారుల సమాచారం ప్రకారం మావోయిస్టులు మధ్వి హిడ్మా బటాలియన్-1 సెక్యూరిటీ బృందం సభ్యులు. వారు హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత తల దాచుకునేందుకు నగరాలకు వలస వచ్చారు. "వీరు ఆయుధాలు లేకుండా, కార్మికులుగా జీవించాలని ప్రణాళిక వేశారు. లొంగిపోవడానికి ఎటువంటి సంకేతాలు లేవు." అని కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఇది మావోయిస్టుల అర్బన్ విస్తరణ ప్రణాళికకు (గెరిల్లా ఉద్యమాన్ని నగరాలకు మార్చడం) భాగమని పోలీసులు అంచనా.

మావోయిస్టులను కుంగదీసిన ఘటనలు

ఆంధ్ర-ఒడిషా సరిహద్దులోని మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు మావోయిస్టులను తీవ్ర దెబ్బ తీటాడాయి. మొదటి ఎన్‌కౌంటర్‌లో (నవంబర్ 18) సీపీఐ(మావో) సెంట్రల్ కమిటీ సభ్యుడు మధ్వి హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు సెక్యూరిటీ గార్డులతో పాటు 6 మంది మరణించారు. రెండో రోజు (నవంబర్ 19) మరో 7 మంది (ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు) చనిపోయారు. వీరిలో టెక్ శంకర్ వంటి కీలక నేతలు ఉన్నారు.

హిడ్మా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా చత్తీస్‌గఢ్ బస్తార్‌లో మావోయిస్టు కార్యకలాపాలు నడిపేవాడు. అతని మరణం మావోయిస్టుల బెటాలియన్-1ను బలహీనపరిచింది. ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా ప్రకారం, "హిడ్మా ఎన్‌కౌంటర్ సమాచారం ఆధారంగానే ఆటోనగర్ రైడ్ జరిగింది. మిగిలినవారు దాక్కోవడానికి ప్రయత్నించారు." ఈ ఎన్‌కౌంటర్లు మావోయిస్టులను మరింత భయపెట్టాయని, వారు నగరాలకు రావడానికి కారణమైందని విశ్లేషకుల అంచనా.

చత్తీస్‌గఢ్, ఒడిషాలో లొంగుబాటు ఒడిదుడుకులు

2025లో మావోయిస్టు ఉద్యమం చివరి దశలోకి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 1,040 మంది లొంగిపోయారు ఇది ఒకే సంవత్సరంలో రికార్డు. ఒక్కోసారి 51 మంది ఒకేసారి ఆయుధాలు వదులుకున్నారు. ఒడిషాలో కూడా కంధమాల్‌లో చత్తీస్‌గఢ్ మావోయిస్టు దంపతులు (ఉంగా కల్ము, మాసే మాద్వి) లొంగిపోయారు. వారు "పార్టీలో అసంతృప్తి"గా చెప్పుకున్నారు. మొత్తంగా 2025లో 1,225 మంది సరెండర్‌లు, 680 అరెస్టులు జరిగాయి. ఆపరేషన్ కగార్ (చత్తీస్‌గఢ్) వంటి క్యాంపెయిన్‌లు మావోయిస్టులను బలహీనపరిచాయి.

కానీ విజయవాడ న్యూ ఆటోనగర్ లో పట్టుబడటానికి లొంగుబాటుతో సంబంధం లేదు. పోలీసు నివేదికల్లో "సరెండర్" అనే పదం లేదు. వీరు తల దాచుకోవడానికి వచ్చారని, ఆయుధాలు వదిలి నగరాల్లో రీగ్రూప్ అవ్వాలని ప్రణాళిక వేశారనేది పరిశీలకులు చెబుతున్న మాట.

అనుచరుల సమాచారం, బోనస్ అరెస్టులు?

సోషల్ మీడియా, స్థానిక వర్గాల్లో "వీరు లొంగిపోవడానికి వచ్చారు, అనుచరులు సమాచారం ఇచ్చారు, పోలీసులు బోనస్‌గా పట్టుకున్నారు" అనే ప్రచారం సాగుతోంది. ఇది మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉందని కొందరు చెబుతున్నారు. కానీ ఇందులో నిజానిజాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని అంశం.

హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు మావోయిస్టు మొబైల్‌లు, కమ్యూనికేషన్‌లను ట్రాక్ చేసి ఆటోనగర్ రైడ్ చేశారు. ఇది ఇంటెలిజెన్స్ ఆపరేషన్, కానీ 'లొంగిపోవడానికి' సమాచారం కాదు. 50 మంది పట్టుబడటం ప్రణాళిక రైడ్‌లు. ఒకే సారి ఇంత మంది పట్టుబడటం 'బోనస్' కాదు, మావోయిస్టుల అర్బన్ దారి పట్టి బడ్డారనే ప్రచారం కూడా ఉంది. మావోయిస్టు లొంగుబాటు ట్రెండ్‌తో (చత్తీస్‌గఢ్‌లో వందల సంఖ్య) ముడిపెట్టి, స్థానికంగా వ్యాపించింది. కానీ, అధికారిక నివేదికల్లో ఇది లేదు. ఇది మావోయిస్టుల ప్రచార యుద్ధానికి (ప్రజల్లో సానుభూతి రేకెత్తించడం) భాగమే అయి ఉంటుందనే అనుమానం పోలీసు పెద్దల్లో ఉంది.

మావోయిస్టు ఉద్యమం చివరి దశ, ఆంధ్రలో కొత్త అధ్యాయం

ఈ ఘటనలు మావోయిస్టు ఉద్యమం చివరి దశను సూచిస్తున్నాయి. 2010లో 180 జిల్లాల నుంచి 2025కి 7 జిల్లాలకు తగ్గింది. ఆపరేషన్ కగార్, రోడ్ల నిర్మాణం, సంక్షేమ పథకాలు, టెక్నాలజీ మావోయిస్టులను బలహీనపరిచాయి. లొంగుబాటు రేటు పెరగడం, ఎన్‌కౌంటర్లు, అరెస్టులు ఇవన్నీ 'రెడ్ టెర్రర్' చివరి చూపులు.

ఆటోనగర్ లో పట్టుబడింది లొంగిపోవడానికి వచ్చిన వారు కాదు. అర్బన్ లో అజ్ఞాత వాసం చేస్తూ పార్టీ కార్యకర్తలను తయారు చేయాలనే వ్యూహంతో మాత్రమే వచ్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ప్రచారాలు ఉన్నా, పోలీసు ఆపరేషన్‌ల శక్తి నిజం. ఆంధ్ర పోలీసులు, కేంద్ర బలగాలు కొనసాగిస్తున్న ఈ పోరు, మావోయిస్టు ఉద్యమానికి తుది తీర్పు ఇస్తుందేమోననే చర్చ కూడా ప్రజల్లో ఉంది.

(ఈ కథనం పోలీసు, మీడియా నివేదికల ఆధారంగా...)

Read More
Next Story