ఏపీలో భారీ ఎన్‌కౌంటర్‌..ముగ్గురు మావోయిస్టులు మృతి
x

ఏపీలో భారీ ఎన్‌కౌంటర్‌..ముగ్గురు మావోయిస్టులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసు భద్రతా బలగాలకు మధ్య బుధవారం తెల్లవారు జామున పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల లిమిట్స్‌లో కొండమొదలు, కొయ్యలగూడెం, చింతకాయల తదితర గ్రామాల పరిసర అటవీ ప్రాంతాల్లో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గరు మావోయిస్టు కీలక నేతలు మరణించారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఆలియాస్‌ రామచంద్రారెడ్డి ప్రతాప్‌రెడ్డి భార్య, మావోయిస్టు పార్టీ జోనల్‌ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు మరో కీలక నేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఆలియాస్‌ ఉదయ్, మరో మావోయిస్టు పార్టీ కీలక నేత అంజు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఎదురు కాల్పులు జరిగిన ఘటనా స్థలంలో మూడు ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల సందర్భంగా ఘటనా స్థలం నుంచి మరి కొంరు మావోయిస్టులు పరారయ్యారని అనుమానిస్తున్న పోలీసు భద్రతా బలగాలు వారి కోసం మారేడుమిల్లి అడవుల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉదయ్, అరుణలపై రివార్డులు ఉన్నట్లు తెలిసింది.

చనిపోయిన మావోయిస్ట్‌ నేతల వివరాలు..

గాజర్ల రవి

గాజర్ల రవి.. అలియాస్‌ ఉదయ్‌.. అలియాస్‌ గణేష్‌ అలియాస్‌ బిరుసు అనే పేర్లు ఉన్నాయి. ఇతనిది తెలంగాణ రాష్ట్రం, భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలంలో వెలిశాల గ్రామం. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడుగా ఉన్నారు. ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ మెంబర్‌గా కూడా ఉన్నారు. ఇతనిపై 25 లక్షలు రివార్డ్‌ ఇప్పటికే ఉంది.

భర్త చలపతితో అరుణ

వెంకట రవి లక్ష్మి చైతన్య, అలియాస్‌ అరుణ. అలియాస్‌ రూపీ అనే పేర్లు ఉన్నాయి. ఈమెకు 54 ఏళ్లు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవాణిపాలెంకు చెందిన వారు. ఈమెపై 20 లక్షల రివార్డ్‌ ఉంది. మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్‌గా ఉన్నారు. ఎవోబీ మెంబర్‌గా కూడా ఉన్నారు.

ఈమె తమ్ముడు అజాత్‌ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈమె తల్లి మాజీ మావోయిస్టు నేత గతంలో మృతి చెందారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు పార్టీ అగ్ర నేత, సెంట్రల్‌ కమిటీ కీలక సభ్యుడు చలపతి ఈమె భర్త. చలపతి చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వరరావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొన్నారు.

Read More
Next Story