మాదిగలంటే ఇంత అలుసా మీకు?
x

మాదిగలంటే ఇంత అలుసా మీకు?

అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా కేటాయించలేదు. ఇది మమల్ని వివక్షకు గురి చేయడమేనని మాదిగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.


(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: దళితులకు కేటాయించిన రిజర్వుడ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కూటమికి తిరుపతిలో నిరసన సెగ తగిలింది. రాయలసీమలో భాగంగా ఉన్న ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా ఎందుకు కేటాయించలేదంటూ మాదిగ సంఘాలు, శ్రేణులు బిజెపి నాయకులను నిలదీశాయి. తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం గురువారం జరిగింది. బిజెపి రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ అరుణ్ సింగ్ వచ్చారనే విషయం తెలుసుకున్న మాదిగ సంఘాల నాయకులు ప్లకార్డులతో నిరసనలకు దిగారు.

మాదిగల మద్దతు ఉంది కదా..

దీర్ఘకాలిక ప్రయోజనాలు మాదిగ సామాజిక వర్గం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బిజెపితో జత కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న వేదికను మందకృష్ణ మాదిగ పంచుకున్నారు. అధికంగా ఉన్న మాదిగలకు జనాభా దామాషాలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని, అన్ని రంగాల్లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. అదే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా విస్తరింపజేశారు. రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అంశంలో స్వార్థ ప్రయోజనాలకు ఆస్కారం లేకుండా జాతి మనుగడ అభ్యుదయానికి కట్టుబడి తాను పదవులకు దూరంగా ఉంటానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రిజర్వుడ్ స్థానంలో మాత్రం మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ కోవలో..

నిరసనకు దిగిన మాదిగలు

ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో మాదిగల పట్ల టిడిపి, జనసేన, బిజెపి వివక్ష చూపించాయని మాదిగ సంఘాల నాయకులు ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మాదిగలకు తక్కువ వాటా ఇచ్చారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా పరిధిలో రెండు రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు పార్లమెంటు స్థానం మాత్రమే మాదిగలకు కేటాయించారు. "మిగతా ఐదు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానం మాలలకే కేటాయించడం ఏమిటని"మాదిగ మహాజన సంఘం నేత కరాటపు సుధాకర్ ప్రశ్నించారు. మిగతా పార్టీలు మాలలకే ప్రాధాన్యత ఇచ్చాయని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు మేలు చేస్తాం అని చెప్పిన బిజెపి, రెండు సార్లు కేంద్రంలోకి వచ్చినా, మాదిగలను మోసం చేశారన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగానే ఉన్నారంటున్నారన్నది మాదిగల వాదన.

Read More
Next Story