మోకాళ్లపై కూర్చోబెట్టి..కుల బహిష్కరణ చేసి..
x

మోకాళ్లపై కూర్చోబెట్టి..కుల బహిష్కరణ చేసి..

అవమానం భరించలేక అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్పీ వీడియో విడుదల చేసిన ఓ కుటుంబం.


గ్రామ కట్టుబాట్ల పేరుతో సాగిన కుల బహిష్కరణ ఒక నిండు కుటుంబాన్ని బలవన్మరణానికి పురికొల్పింది. సారా మాఫియా కంటే ఘోరంగా కులపెద్దలు విధించిన రూ. లక్ష జరిమానా, మోకాళ్లపై నిలబెట్టి చేసిన అవమానం తట్టుకోలేక ఏలూరు జిల్లా లోపూడిలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. చట్టం ఉండగా.. కుల పంచాయితీలేమిటన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామంలో చోటుచేసుకున్న కుల బహిష్కరణ ఘటన ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వార్త వివరాల్లోకి వెళ్తే..

ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన బోట్ల కనకరావు గతంలో సారా విక్రయాలు చేసేవాడు. ఈ క్రమంలో ఎక్సైజ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు. అయితే, కనకరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ కులపెద్దలు పది రోజుల క్రితం పంచాయితీ నిర్వహించారు. సారా విక్రయాలు ఆపాలని, లేదంటే రూ. లక్ష జరిమానా కట్టాలని హుకుం జారీ చేశారు.

మోకాళ్లపై..

కులపెద్దల ఆదేశాలను కనకరావు వ్యతిరేకించడంతో, ఆగ్రహించిన పెద్దలు కనకరావుతో పాటు అతని కుటుంబ సభ్యులను అందరి ముందు మోకాళ్లపై నిలబెట్టి అవమానించారు. అంతేకాకుండా, ఆ కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నామని, గ్రామస్థులెవరూ వారితో మాట్లాడకూడదని ఈ నెల 3న చాటింపు వేశారు.
సెల్ఫీ వీడియోతో ఆత్మహత్య హెచ్చరిక
సమాజంలో ఎదురైన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన కనకరావు, తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఆదివారం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. "కులపెద్దల వేధింపుల వల్లే మేము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాం" అని ఆ వీడియోలో పేర్కొంటూ ఆరుగురు కులపెద్దల పేర్లను బయటపెట్టాడు.
పోలీసుల గాలింపు
వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కనకరావు కుటుంబం గ్రామంలో కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. బాధితుడి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులుగా పేర్కొన్న సుదగాని రాంబాబు, చలమాల వెంకటేశ్వరరావు సహా ఆరుగురు కులపెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అదృశ్యమైన బాధితుల అచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Read More
Next Story